
గుంటూరు: ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండదండలతో వైసిపి నాయకులు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ ఇవాళ (సోమవారం) గుంటూరు టిడిపి ఆధ్వర్యంలో ఛలో అనుమర్లపూడి చేపట్టారు. ఈ క్రమంలో అనుమర్లపూడిలో 144సెక్షన్ విధించి ఆందోళనలను సిద్దమైన గుంటూరు జిల్లా టిడిపి నాయకులను హౌస్ అరెస్ట్ చేసారు. అయితే పోలీస్ వలయాన్ని దాటుకుని అనుమర్లపూడి చెరువు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టిన ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాళ్లుచేతులు పట్టుకుని ధూళిపాళ్లను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీస్ వాహనంలో ఎక్కించి అక్కడినుండి తరలించారు. ఇలా ధూళిపాళ్ల పట్ల దారుణంగా వ్యవహరిస్తూ పోలీసులు అరెస్ట్ చేయడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ అయ్యారు.
''మట్టిదొంగల్ని వదిలేసి..పోరాడే ధూళిపాళ్లని అరెస్ట్ చేస్తారా? వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. జగన్రెడ్డికి ఒక్క చాన్సే చివరి చాన్స్ అని తేలిపోవడంతో వైసీపీ ప్రజాప్రతినిధులు అన్నివిధాలా దోపిడీకి పాల్పడుతున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ మట్టి, గ్రావెల్ మాఫియా రాజ్యమేలుతుంది. అక్రమార్కులకు అండగా నిలిచిన పోలీసులు... దోపిడీని ప్రశ్నించిన ధూళిపాళ్ల నరేంద్రని అరెస్ట్ చేయడం రాష్ట్రంలో అరాచకపాలనకి అద్దం పడుతోంది'' అంటూ లోకేష్ మండిపడ్డారు.
''గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువుని మాయం చేసిన మట్టి మాఫియా ఆగడాలపై పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టుని ఖండిస్తున్నా. మట్టి మాఫియాతో పోరాటంలో ధూళిపాళ్ల వెంట తెలుగుదేశం పార్టీ వుంటుంది'' అని లోకేష్ తెలిపారు.
ఛలో అనుమర్లపూడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో గుంటూరు టిడిపి అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్, టిడిపి క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల మ్యానీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. అనుమర్లపూడికి వెళ్లడానికి సిద్దమవుతుండగా వీరి ఇళ్లవద్దకు చేరుకున్న పోలీసులు బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు టిడిపి నాయకులు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. చివరకు చేసేదేమిలేక శ్రవణ్, మ్యానీ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.
ఇలాగే ధూళిపాళ్ల ఇంటివద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు.అయితే పోలీసుల కళ్లుగప్పి, చెక్ పోస్టులను దాటుకుని ఎలాగోలా అనుమర్లపూడి చెరువువద్దకు చేరుకున్ని ధూళిపాళ్ళ ఆందోళనకు దిగారు. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక ఇప్పటికే అనుమర్లపూడి పోలీసుల వలయంలో వుంది. చుట్టుపక్కలంతా చెక్ పోస్టులను ఏర్పాటుచేసి గ్రామంలోని ఎవ్వరినీ అనుమతించడం లేదు పోలీసులు. ప్రస్తుతం అనుమర్లపూడిలో 144సెక్షన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి నిరసనలకు అనుమతించడం లేదన్నారు.