తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, శాససభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడును అరెస్ట్ పై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, శాససభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కాం లో ఏసిబి అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్ట్ పై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాను 16 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి అందర్నీ జైల్లో పెట్టాలని జగన్ చూస్తున్నారని లోకేష్ ఆరోపించారు.
''శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను.కక్ష సాధింపులో భాగంగానే జగన్ బీసీ నేత అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేయించారు.ఏడాది తుగ్లక్ పాలనలో జరుగుతున్న అరాచకాలను,అన్యాయాలను బయటపెట్టినందుకే అచ్చెన్నాయుడు పై జగన్ పగ పట్టారు'' అని లోకేష్ పేర్కొన్నారు.
read more మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్: ఈఎస్ఐ స్కామ్ ఏమిటి?
''బీసీ లకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు గతంలో ఆయన పై వ్యక్తిగత దూషణలకు దిగి జగన్ రాక్షస ఆనందం పొందారు.లక్ష కోట్లు కొట్టేసి 16 నెలలు ఊచలు లెక్కపెట్టిన జగన్ అందర్నీ జైలులో పెట్టాలనుకోవడం సహజమే'' అని మండిపడ్డారు.
''రాజారెడ్డి రెడ్డి రాజ్యాంగం అమలులో ఉంది ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా అరెస్ట్ చేస్తానని జగన్ గారు అనుకుంటున్నారు.బడుగు,బలహీన వర్గాలకి రక్షణగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉందనే విషయం జగన్ గారు గుర్తెరిగితే మంచిది'' అంటూ వరుస ట్వీట్లతో జగన్ పై విమర్శలు కురిపించారు లోకేష్.