ఎవ్వరినీ వదిలిపెట్టం... తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందే..: వైసిపి నాయకులకు చంద్రబాబు వార్నింగ్

By Arun Kumar PFirst Published Jul 13, 2021, 2:23 PM IST
Highlights

తన నలబై సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితిని చూడలేదని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. దూళిపాళ్ల నరేంద్రను కక్షపూరితంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.

గుంటూరు: వైసిపి ప్రభుత్వం ఇలాగే కక్షపూరితంగా ముందుకు వెళితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పొన్నూరు  నియోజకవర్గం చింతలపూడిలోని సంగం డెయిరీ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఇటీవలే జైలు నుండి విడుదలైన ఆయనను పరామర్శించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...  రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితిని తన నలబై సంవత్సరాల రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. విలువలు లేని కక్షా రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి పని చేసే వారు భవిష్యత్ లో మూల్యం చెల్లించుకోంటారని చంద్రబాబు హెచ్చరించారు. 

''రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నరేంద్రది. గతంలో ఆయన తండ్రి... ఇప్పుడు నరేంద్ర ఇక్కడి ప్రజలకు, సంగం డైరీ రైతాంగానికి అండగా ఉంటున్నారు. వరుసగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ సేవలు అందించారు. రైతుల కోసం నిరంతరం కృషి చేసిన కుటుంబం నరేంద్రది'' అని కొనియాడారు. 

''సంగం, విశాఖ చట్ట ప్రకారం బదిలీ అయ్యాయి. సంగం డైరీ ఆధ్వర్యంలో ఒక హస్పిటల్ పెట్టి సేవలు అందిస్తున్నారు. అలాంటిది రాజకీయ కక్షతో ఏ తప్పు చేయకుండా ముందస్తు నోటీసులు లేకుండా నరేంద్రని అరెస్ట్ చేశారు'' అని ఆరోపించారు. 

''అచ్చెన్నాయుడు, నరేంద్ర వంటి అవినీతిని ప్రశ్నించే వారిని అరెస్ట్ చేస్తున్నారు. అందరూ వైసీపీ నేతల్లాగా తప్పుడు మనుషులు లేరు. నరేంద్ర ఆస్తులు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు గడిచిన 10సంవత్సరాలలో ఎంత పెరిగాయో ప్రజలు చూడాలి. ధర్మం కోసం ప్రజా వ్యతిరేక విధానాలపై నరేంద్ర పోరాటం చేస్తున్నారు'' అన్నారు. 

read more  సీఎం జగన్ కు కోర్టులంటే లెక్కేలేదు... అందుకే ఈ పరిస్థితి: దేవినేని ఉమ సీరియస్

''ప్రభుత్వంలో 43వేల కోట్ల రూపాయల అవినీతి చేశారు. ఇప్పుడు చేస్తున్న అవినీతికి కోర్టులు కూడా చాలవు. సోషల్ మీడియా కేసులో అరెస్ట్ చేయవద్దని సుప్రీం చెప్పినా వీళ్లు అరెస్ట్ చేస్తున్నారు. ఉన్మాది పాలలో పోలీసులు కూడా అలాగే తయారయ్యారు'' అని చంద్రబాబు మండిపడ్డారు. 

''ఈ ప్రభుత్వానికి రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయి... ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు అలాంటి వారిని వదిలిపెట్టం. రాయలసీమలో గతంలో ఉన్న హత్యా రాజకీయాలు, ముట్టా కక్షకు చరమగీతం పాడాం. అలాంటిది మళ్ళీ ఈ ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుంది. గతంలో మేము ఇదే విధంగా చేస్తే మీరు ఈ రోజు అధికారంలో ఉండేవారా...?'' అని నిలదీశారు.

''సర్పంచ్ అధికారాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. దీనిపై కోర్టు అక్షింతలు పట్టాయి. స్థానిక సంస్థలు బలోపేతం చేయాలనే లక్ష్యంతో నరేగా నిధులు నేరుగా పంచాయతీలకు ఇస్తున్నారు. కేంద్రం నుండి నిధులు వస్తున్నాయి కాబట్టి కేంద్రం ఏపీలో వాళ్ల సచివాలయం పెడితే ఊరుకోంటారా..?'' అని ప్రశ్నించారు. 

''సర్పంచ్ లు రాజకీయాలకు అతీతంగా మీ హక్కులను కాపాడుకోవాలి. ఈ సీఎం వ్యవస్థను ఇష్టానుసారంగా నిర్వీర్యం చేశారు. ఐఎఎస్, ఐపిఎస్ లను సైతం నిర్వీర్యం చేసారు. ఇప్పుడు సర్పంచ్ లపై పడ్డారు'' అని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.


 

click me!