హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలిగించటాన్ని ఖండించిన నందమూరి రామకృష్ణ.. ఏమన్నారంటే..

By Sumanth KanukulaFirst Published Sep 22, 2022, 10:06 AM IST
Highlights

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వర్సిటీ పేరు మార్పు బిల్లకు బుధవారం ఏపీ అసెంబ్లీ ఆమోదం  కూడా తెలిపింది. ఈ పరిణామంపై నందమూరి కుటుంబం స్పందించింది.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వర్సిటీ పేరు మార్పు బిల్లకు బుధవారం ఏపీ అసెంబ్లీ ఆమోదం  కూడా తెలిపింది. ఈ పరిణామంపై నందమూరి కుటుంబం స్పందించింది. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇదొక దురదృష్టకరమైన పరిణామమని పేర్కొన్నారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు.

హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. 1986లో ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీని స్థాపించారని తెలిపారు. నాడు ప్రజలు, పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. నందమూరి తారకరామా రావు గారు 1996 లో మరణించారని తెలిపారు.  ఎన్టీఆర్ మరణించిన తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టారని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీద గౌరవంతో డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీగా నామకరణం చేశారని చెప్పారు. ఆ పేరును‌ నేడు జగన్ మార్చడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 

Also Read: ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మార్చడం ప్రమాదకరం.. మీలాగే మేం చేసుంటే : జగన్‌పై అచ్చెన్న ఆగ్రహం

ఎన్టీఆర్ పేరును తొలిగించటం యావత్ తెలుగు జాతిని అవమానించినట్లేనని అన్నారు. అన్ని పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు చెందిన మహా నాయకుడు యుగపురుషుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడి పునర్జింప చేసిన మహా నాయకుడు, తెలుగు ముద్దుల బిడ్డ ఎన్టీఆర్ అని అన్నారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం శాసనసభలో బిల్లు పెట్టింది. వర్సిటీకి వైఎస్సార్ పేరు పెడుతూ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని సభలో ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు మాట్లాడిన అనంతరం ఈ బిల్లు ఆమోదం పొందినట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అయితే టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలోని పలుచోట్ల టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. 

click me!