ఏపీ పోలీసులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్..

By Sumanth KanukulaFirst Published Jan 9, 2022, 3:40 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ పోలీసులపై (Andhra Pradesh Police) బీజేపీ ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) మరోసారి సంచలన వ్యాక్యలు చేశారు. ఏపీలో కొందరు పోలీసులు వైసీపీ పార్టీ కండువాలు వేసుకున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ పోలీసులపై (Andhra Pradesh Police) బీజేపీ ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) మరోసారి సంచలన వ్యాక్యలు చేశారు. ఏపీలో కొందరు పోలీసులు వైసీపీ పార్టీ కండువాలు వేసుకున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యానికి నిరసిస్తూ విశాఖపట్నంలో (Visakhapatnam) చేపట్టిన దీక్షలో సీఎం రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరస ఓటముల ఆక్రోశం విపక్షాలలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అందుకే సాక్షాత్తు ప్రధాని మోదీ భద్రతకే ఆటంకం కలిగేలా ఈ వికృత చేష్టలకు పాల్పడ్డారని మండిపడ్డారు. 

ప్రధానికి భద్రత కల్పించడంలో పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సీఎం రమేష్ ఆరోపించారు. దేశ ప్రజలందరూ ఈ సంఘటనను ఖండిస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీనియర్ నేత రాహుల్ గాంధీలు స్పందించాలని డిమాండ్ చేశారు. 

ఈ క్రమంలోనే రాష్ట్ర పోలీసులపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలను సీఎం రమేష్ ప్రస్తావించారు. పోలీసు వ్యవస్థ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండిపోయిందని.. ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రం చూస్తోందని అన్నారు. అందుకే రీకాల్ చేస్తారని చెప్పానని.. అది త్వరలోనే జరుగుతుందని సీఎం రమేష్ అన్నారు.  

ఇక, కొద్ది రోజుల క్రితం సీఎం రమేష్ మాట్లాడుతూ.. ఏపీలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం టెలిస్కోపుతో చూస్తుందని.. అతి త్వరలోనే పోలీసు వ్యవస్థ ప్రక్షాళన ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు వ్యవహరించడం లేదని అన్నారు. వ్యవస్థలు ముఖ్యం అనే విషయాన్ని వారు ఎందుకు మర్చిపోతున్నారని ప్రశ్నించారు. అవసరమైతే కొందరు ఐపీఎస్ అధికారులను కేంద్రం రీ కాల్ చేస్తుందని అన్నారు. 

కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారుల విషయంలో కేంద్రం ఏ విధంగా వ్యవహరించిందో చూశామని సీఎం రమేష్ అన్నారు. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే వచ్చాయని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగమే వెసులుబాటు కల్పించిందన్నారు.

click me!