విదేశాలకు డబ్బులు,చంద్రబాబు జైలుకే: రోజా

By narsimha lodeFirst Published Feb 27, 2020, 8:32 AM IST
Highlights

చంద్రబాబు, లోకేష్ లు విదేశాలకు డబ్బులు పంపారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఈ కేసులో వీరంతా జైలుకు వెళ్లడం ఖాయమని ఆమె చెప్పారు. 


శ్రీశైలం:చంద్రబాబుతో పాటు లోకేష్ త్వరలో జైలుకు వెళ్లనున్నారని నగరి ఎమ్మెల్యే రోజా జోస్యం చెప్పారు. నగరి ఎమ్మెల్యే, సినీనటి ఆర్ కే రోజా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని ఇవాళ తెల్లవారుజామున దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ రాజగోపురం నుంచి మర్యాదపూర్వకంగా శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు రోజా దంపతులకు స్వాగతం పలికారు. ఈ మేరకు ఆలయంలో రుద్రాభిషేకాలను కుంకుమార్చనలను నిర్వహించారు రోజా.

 అనంతరం అమ్మవారి ఆశీర్వాద మండపంవద్ద ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు అమ్మ వారి శేష వస్త్రాలు అలాగే స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహుమతిగా ఆలయ అధికారులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు   ఈ రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో వర్ధిల్లాలని కోరుకున్నట్టు చెప్పారామె. జగన్ ప్రభుత్వం పై చంద్రబాబు దాడి చేస్తున్నారన్నారు.  దిగజారుడు రాజకీయాలు చేసి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రయత్నిస్తున్నారని బాబుపై ఆమె విమర్శలు గుప్పించారు. 


రాష్ట్రం అప్పుల్లో ఉంది డబ్బులు లేవని మభ్యపెట్టి  చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకున్నాడన్నారు.  జగన్  మాత్రం తాను ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నాడని రోజా చెప్పారు.  పేదల కష్టాలను దూరం చేసే విధంగా ఒక్కో పథకాన్ని విజయవంతంగా అమలు చేసి దేశం మొత్తం జగన్ వైపు చూసే విధంగా పరిపాలన చేస్తున్నారని ఆమె అన్నారు.

అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం వికేంద్రీకరణ ద్వారా మూడు రాజధానులు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం కోసమే జగన్ ప్రయత్నిస్తున్నారని రోజా చెప్పారు. చంద్రబాబు మాత్రం తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. 

చంద్రబాబు మాజీ  పి ఎస్ శ్రీనివాస్ పై ఐటీ దాడులు చేస్తే భయపడిపోయారని ఈ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకున్న డబ్బులు లెక్కలు తేలుతాయన్నారు.విదేశాలకు కోట్ల డబ్బులు పంపారని ఆమె బాబు, లోకేష్ పై ఆరోపణలు చేశారు.  చంద్రబాబు లోకేష్ ఆయన క్యాబినెట్  సభ్యులు తొందరలో జైలుకు వెళ్తారని ఆమె చెప్పారు.


 

click me!