తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హైటెక్ సిటీలో జరిగిన కారు ప్రమాదం ఘటనలో తన కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డి పేరు రావడంపై ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వివరణ ఇచ్చారు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల హైటెక్ సిటీలో జరిగిన కారు ప్రమాదం ఘటనలో తన కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డి పేరు రావడంపై ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వివరణ ఇచ్చారు.
గురువారం రాత్రి హైటెక్ సిటీలో ఓ కారు సిగ్నల్ జంప్ చేసి బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మరణించగా, ఆయన భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మద్యం మత్తులో కారు నడపి ఇద్దరు వ్యక్తులు ఈ కారు ప్రమాదం చేశారు కారులో ఉన్న కాశీ విశ్వనాథ్, కౌశిక్ అనే ఇద్దరు యువకులు ప్రమాదం చేసిన వెంటనే పారిపోయారు. కాగా, ఆ కారు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తనయుడు కాటసాని ఓబుల్ రెడ్డి పేరు మీద ఉంది. దీంతో ఓబుల్ రెడ్డి పేరు కేసులో ప్రస్తావనకు వచ్చింది.
తన కుమారుడు ఓబుల్ రెడ్డి పేరును సంబంధం లేని విషయంలోకి లాగుతున్నారని అన్నారు. రిపేర్ కోసం కారును నాలుగు రోజుల క్రితం గ్యారేజ్లో ఇచ్చామని ఎమ్మెల్యే చెప్పారు.
గురువారం ఉదయమే కారు తమకు అందాల్సి వుందని, అయితే తమ కుమారుడి మిత్రుడు కౌషిక్ గ్యారేజ్ నుంచి కారును తీసుకున్నాడని కాటసాని వెల్లడించారు.
కారును తీసుకొచ్చి తమకు అప్పగిస్తాడని భావించామని, అయితే అతను మరో స్నేహితుడితో కలిసి పబ్కు వెళ్లాడని తెలిపారు. అక్కడి నుంచి తిరిగి వచ్చే సమయంలో రోడ్డు ప్రమాదం జరిగిందన్నారు కాటసాని.
ప్రమాదం జరిగిన రోజు ఓబుల్ రెడ్డి బనగానపల్లెలో పాదయాత్రలో పాల్గొన్నాడని రాంరెడ్డి వెల్లడించారు. కేసు తారుమారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు అవాస్తవం అని పేర్కొన్నారు.