ఏపీకి రూ. 488.15 కోట్ల హెల్త్‌ గ్రాంట్‌ విడుదల చేసిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం షాక్..

By team teluguFirst Published Nov 14, 2021, 12:58 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఆర్థిక శాఖ (Ministry of Finance) హెల్త్ గ్రాంట్ (health grant) విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం (Fifteenth Finance Commission) సిఫార్సుల మేరకు ప్రస్తుతం ప్రతిపాదనలు పంపిన 19 రాష్ట్రాలకు రూ.8,453.92 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఆర్థిక శాఖ (Ministry of Finance) హెల్త్ గ్రాంట్ (health grant) విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 28 రాష్ట్రాలకు కలిపి 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.13,192 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, ప్రస్తుతం ప్రతిపాదనలు పంపిన 19 రాష్ట్రాలకు రూ.8,453.92 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఈ క్రమంలోనే andhra pradeshకి రూ. 488.15 కోట్ల హెల్త్ గ్రాంట్ విడుదల చేసింది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ స్థాయిలో ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడానికి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో క్లిష్టమైన అంతరాలను పూడ్చడానికి గ్రాంట్లను విడుదల చేసినట్టుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇక, తెలంగాణ సహా మిగిలిన 9 రాష్ట్రాలకు ప్రతిపాదనలు అందిన తర్వాత నిధులు విడుదల చేస్తామని ఆర్థికశాఖ  విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం 2021-22 నుంచి 2025-26 మధ్య కాలానికి దేశంలోని స్థానిక సంస్థలకు రూ.4,27,911 కోట్ల గ్రాంట్‌ సిఫార్సు చేసింది. అందులో 70,051 కోట్లు హెల్త్‌ గ్రాంట్‌ కింద ఇచ్చింది. ఇందులో రూ.43,928 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థలు, రూ.26,123 కోట్లు పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని వైద్య ఆరోగ్యరంగానికి ఖర్చు చేయాలని సూచించింది. 

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు.. డయోగ్నొస్టిక్ మౌలిక సదుపాయాల కోసం రూ. 16,377 కోట్లు, బ్లాక్ లెవల్ పబ్లిక్ హెల్త్ సెంటర్ల కోసం రూ. 5,279 కోట్లు, కేటాయించబడ్డాయి. అలాగే  గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య, ఉప కేంద్రాలను ఆరోగ్య, ఆరోగ్య కేంద్రాలుగా మార్చేందుకు రూ.15,105 కోట్లు, భవనాలు లేని ఉప కేంద్రాలు, పీహెచ్‌సీలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ) భవనాల నిర్మాణానికి రూ.7,167 కోట్లు కేటాయించారు. ఇక, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల కోసం రూ.24,000 కోట్లు కేటాయించగా, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డయాగ్నస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.2,095 కోట్లు అందించనున్నారు.

మొత్తం గ్రాంట్లలో గ్రామీణ ప్రాథమి ఆరోగ్యకేంద్రాల్లో రోగ నిర్ధారణ మౌలిక వసతులకు 23.37%, గ్రామీణ ప్రాంతాల్లో బ్లాక్‌ స్థాయి ప్రజారోగ్య కేంద్రాల కోసం 7.53%, ఆరోగ్యకేంద్రాల నిర్మాణానికి 10.23%, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్చడానికి 21.56%, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో రోగ నిర్ధారణ మౌలిక వసతుల కల్పనకు 2.99%, పట్టణ ప్రాంతాల్లో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాల ఏర్పాటుకు 34.30% కేటాయించింది. అయిదేళ్లలో ఈ పద్దుకింద ఏపీకి రూ.2,601 కోట్లు దక్కుతుంది. తొలి రెండేళ్లు రూ.490 కోట్ల చొప్పున, మిగిలిన మూడేళ్లు రూ.514 కోట్లు, రూ.540 కోట్లు, రూ.567 కోట్ల మేర రాష్ట్రానికి గ్రాంట్‌ విడుదల కానుంది. ఈ మొత్తాన్ని ఆర్థిక సంఘం ప్రమాణాల మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

click me!