బీజేపీపై మండిపడ్డ మంత్రి యనమల

By rajesh yFirst Published Aug 28, 2018, 6:03 PM IST
Highlights

బీజేపీ నేతలపై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కడం హాస్యాస్పదమన్నారు. కేంద్రం సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ కు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని యనమల నిలదీశారు. నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బాండ్లకు వెళ్లడం, రుణాలు తెచ్చుకోవడం వంటి ప్రయత్నాలన్నీ ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. 

అమరావతి: బీజేపీ నేతలపై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కడం హాస్యాస్పదమన్నారు. కేంద్రం సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ కు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని యనమల నిలదీశారు. నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బాండ్లకు వెళ్లడం, రుణాలు తెచ్చుకోవడం వంటి ప్రయత్నాలన్నీ ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. 

కేంద్రం సహకరించకపోవడంతోనే రాష్ట్రంపై అధిక భారం పడినా సొంతంగా నిధులు సమీకరించాల్సి వస్తోందని యనమల స్పష్టం చేశారు. ప్రజలకు సరైన సమాధానం చెప్పలేకే బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.షెడ్యూల్ 9,10 ప్రకారం సంస్థల విభజన ఇంతవరకు ఓ కొలిక్కి తేకుండా ఏపిని అన్ని రకాలుగా కష్టాలలోకి నెట్టారని మంత్రి మండిపడ్డారు.

అమరావతి నిర్మాణానికి 40వేల కోట్ల రూపాయలు కావాలని డీపీఆర్‌ ఇస్తే...కేవలం రూ.1500కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుందని ఇంతకన్నా అవకాశ వాదం మరొకటి ఉంటుందా అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్వేత పత్రం విడుదల చేయ్యాలని బీజేపీ డిమాండ్ చెయ్యడం పెద్ద జోక్ అన్నారు. అవసరమైతే కేంద్రాన్నే శ్వేత పత్రం విడుదల చేయమని ఏపి బీజేపీ నేతలు కోరాలన్నారు. 

ఏపి పునర్విభజన చట్టంలోని అంశాలు, విభజన సమయంలో ఆనాడు పార్లమెంట్ లో ఇచ్చిన హామీలు, ఎన్నికల ప్రచారంలో మోదీ ఇచ్చిన హామీలు, అమరావతి శంకుస్థాపన సమయంలో మోదీ ఇచ్చిన హామీల అమలుపై శ్వేత పత్రం విడుదల చెయ్యాలని బీజేపీ నేతలు కేంద్రాన్ని కోరాలని సూచించారు. 

అభివృద్దికి ఆటంకాలు కల్పించడం, అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అప్రతిష్ఠపాలు చేయడమే ధ్యేయంగా బీజేపీ వ్యవహరిస్తోందని యనమల దుయ్యబట్టారు. వైసీపీ, బీజేపీల కుట్ర రాజకీయాలకు ప్రజలు తిరుగులేని గుణపాఠం చెబుతారన్నారు. 

click me!