తెలుగుదేశం పార్టీపై ఏపీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్స్పై ఎదురుదాడి చేశారు.
తెలుగుదేశం పార్టీపై ఏపీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్స్పై ఎదురుదాడి చేశారు. టీడీపీకి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు. ప్రజలు టీడీపీ వైపే ఉన్నారని నమ్మితే.. టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వస్తారా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు వారిదే హవా అంటున్నారని.. అదే నిజమైతే తన సవాలును స్వీకరించాలని అన్నారు.
175 నియోజకవర్గాల్లో జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీని ఓడించారని అన్నారు. ఏడేళ్లుగా టీడీపీ గుర్తుపై ఆ పార్టీ గెలిచిన దాఖలాలు లేవని విమర్శించారు. టీడీపీకి అంత నమ్మకం ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నారా లోకేష్ను ఎందుకు పోటీ చేయించలేదని ప్రశ్నించారు. వైసీపీ గెలిస్తే డబ్బులతో గెలిచారని దుష్ప్రచారం చేస్తున్నారని.. అదే టీడీపీ గెలిస్తే మాత్రం ప్రజా తీర్పు అంటున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపవని అన్నారు. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదంటూ కామెంట్ చేశారు. వైసీపీ ఎప్పుడూ ప్రజా తీర్పుతోనే గెలిచిందని అన్నారు. వైసీపీ దెబ్బ ఎలా ఉంటుందో 2019 ఎన్నికల్లో చూపించామని.. మళ్లీ 2024లో కూడా చూపిస్తామని చెప్పుకొచ్చారు. పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఓడించే మగాడు పుట్టలేదని అన్నారు.