
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు సవాల్ విసిరిన లోకేష్ పలాయనం చిత్తగించారంటూ దుయ్యబట్టారు. ఎంపీ మిథున్ రెడ్డి తంబళ్లపల్లెలోనే వున్నారని.. అభివృద్ధిపై తాము ఎప్పుడు సిద్ధంగా వున్నామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చి.. లోకేష్తో మాట్లాడిస్తున్నారని రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. గ్రాడ్యుయేట్ , టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు.
ఇకపోతే.. ఇటీవల లోకేష్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ఈ నెల 12న తంబళ్లపల్లెలో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. ప్లేస్, టైమ్ చెప్పాలని మిథున్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా డీఎన్ఏ నీ బ్లడ్లో వుంటే తనతో పోటీ చేయాలంటూ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరికాదని.. ఎవరో రాసిచ్చింది చదవకూడదన్నారు.
ఇదిలావుండగా.. తన యువగళం పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో వున్నారు నారా లోకేష్. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాను గుప్పిట్లో పెట్టుకుని .. దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మదనపల్లెకి ఏం చేశావంటూ మిథన్ రెడ్డిని ప్రశ్నించారు. తాను తంబళ్లపల్లెలోనే వుంటానని.. చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని లోకేష్ సవాల్ విసిరారు. మీలాగా తాము తప్పు చేయమని.. అభివృద్ధి మాత్రమే చేస్తామని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇద్దరు యువ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో చిత్తూరు జిల్లా రాజకీయం వేడెక్కింది.