పవన్ ని హెచ్చరించిన కళా వెంకట్రావ్

First Published Jul 9, 2018, 12:57 PM IST
Highlights

"రాజకీయ పార్టీలంటే ప్రాంతాలు, మతాలు, వర్గాలను రెచ్చగొట్టేవి కాదు. ఉత్తరాంధ్రలో వెనుకబాటు తనం ఉందంటున్నారు. అయితే దానిపై నీ పార్టీ ఏం నిర్ణయాలు తీసుకుంది."

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని మంత్రి , టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు   కళా వెంకట్రావు హెచ్చరించారు. పవన్ రాజకీయాల గురించి తెలియకుండా మతాలు, ప్రాంతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజల మనసుల్లో విష బీజీలు నాటేలా మాట్లాడటం రాష్ట్రానికి చాలా ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్‌ కల్యాణ్‌ రాజకీయంగా ఇంకా పరిపక్వత చెందలేదు. వీటి కారణంగా రాబోయే తరాలు ఎంత బాధపడతారో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ పార్టీలంటే ప్రాంతాలు, మతాలు, వర్గాలను రెచ్చగొట్టేవి కాదు. ఉత్తరాంధ్రలో వెనుకబాటు తనం ఉందంటున్నారు. అయితే దానిపై నీ పార్టీ ఏం నిర్ణయాలు తీసుకుంది. జనసేన అంటే సింగిల్‌ మ్యాన్‌ ఆర్మీ. అది కూడా కాదు కేవలం వన్‌ మ్యాన్‌ షో అనొచ్చు.

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ సహా మిగతా పెద్దలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పార్టీలు పెట్టి సేవ చేస్తామని వచ్చారు. కానీ విద్వేష రాజకీయాలు చేయడం మంచిది కాదు. ప్రజలను రెచ్చగొట్టటంతో అందరికీ ప్రమాదమే. కాపుల రిజర్వేషన్లపై పవన్‌ మాట్లాడుతున్నారు. పవన్‌.. మీ స్నేహితులు బీజేపీ వాళ్ల దగ్గర ఉన్న రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌ సమావేశాల్లో పాస్‌ చేయించాలి. అయితే ఇలా చేసి ఓ సామాజిక వర్గానికి సాయం చేయడం మానేసి ప్రాంతాలు, కులాలు అంటూ ప్రజలను రెచ్చగొట్టడం తగదు. జనసేనది అనేది స్వరూపం లేని పార్టీ. మీ పార్టీ పాలసీ ఏంటి, స్వరూపం ఏంటో చెప్పడం నాయకుల లక్షణం. తెల్లవారితే సీఎం చంద్రబాబు నాయుడిపై, మంత్రి నారా లోకేష్‌పై, అధికార పార్టీ నేతలపై విమర్శలు చేయడం తగదని’ పవన్‌ కల్యాణ్‌కు కళా వెంకట్రావ్‌ సూచించారు.
 

click me!