‘‘స్కిల్’’ స్కామ్‌లో చంద్రబాబు, లోకేశ్‌ల ప్రమేయం.. బొక్కలోకి పోవడం ఖాయం: జోగి రమేశ్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Dec 4, 2022, 6:55 PM IST
Highlights

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ పాత్ర వుందని ఆరోపించారు మంత్రి జోగి రమేశ్. వారిద్దరూ కూడా బొక్కలోకి పోవడం ఖాయమంటూ ఆయన వ్యాఖ్యానించారు. 
 

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మంత్రి జోగి రమేశ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమాల కేసులో చంద్రబాబు, లోకేశ్‌ల పాత్ర వుందని ఆరోపించారు. వారికి కూడా నోటీసులు ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. అందరి తప్పులు త్వరలోనే బయటకు వస్తాయన్న ఆయన.. వారిద్దరూ కూడా బొక్కలోకి పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. 

కాగా... ఆంధ్రప్రదేశ్  స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కాంపై ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ  స్కాంపై  ఈడీ అధికారులు  26 మందికి నోటీసులు పంపారు. హైద్రాబాద్ లోని  తమ కార్యాలయంలో జరిగే విచారణకు రేపు రావాలని ఈడీ ఆ నోటీసుల్లో పేర్కొంది.  పలు షెల్  కంపెనీలను ఏర్పాటు చేసి రూ. 234  కోట్లను  దారి మళ్లించారని  ఈడీ అనుమానిస్తుంది.  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్  మాజీ చైర్మెన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్  లక్ష్మీనారాయణ సహా 26 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది.  

చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో యువతకు పలు అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు గాను  ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్  పనిచేసింది.  యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగవకాశాలను సృష్టించడమే ఈ  కార్పోరేషన్ ఉద్దేశ్యం. గుజరాత్ రాష్ట్రంలో  సీమెన్స్  సంస్థ  ఇదే తరహలో  కార్యక్రమాలను నిర్వహించింది. దీంతో  చంద్రబాబు సర్కార్   ఈ  పథకాన్ని అమలు చేసింది.  సీమెన్స్, డిజైన్  టెక్  సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో  ఒప్పదం  చేసుకున్నాయి. 

ALso REad:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై ఈడీ ఫోకస్: 26 మందికి నోటీసులు, రేపటి నుండి విచారణ

సెంటర్ ఆఫ్  ఎక్స్ లెన్స్  సంస్థతో పాటు  దానికి కింద టెక్నికల్  స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలను నెలకొల్పారు.   అయితే  ఈ  స్కీంలో  అవకతవకలు జరిగాయని  భావించిన జగన్  సర్కార్  ఏపీ సీఐడీకి విచారణను అప్పగిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ సీఐడీ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు. ఇందులో మనీలాండరింగ్ చోటు చేసుకుందనే అనుమానంతో  సీఐడీ అధికారులు ఈడీకి లేఖ రాశారు. దీంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. 

స్కిల్ డెవలప్ మెంట్ లో నిర్వహించిన ఆడిట్ లో  అవకతవకలు జరిగినట్టు తేలడంతో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం  కుదుర్చుకున్న సీమెన్స్  సంస్థ  రూ. 370 కోట్ల బిల్లులు తీసుకొని  బిల్లులను ఎగ్గొట్టినట్టుగా  అధికారులు గుర్తించారు.

click me!