పడిపోయిన టీడీపీని లేపేందుకు ఎల్లో మీడియా తాపత్రయం: బొత్స

By Siva KodatiFirst Published Jul 29, 2021, 4:49 PM IST
Highlights

పడిపోయిన టీడీపీని లేపడానికి ఎల్లో మీడియా ప్రయత్నం చేస్తోందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చురకలు వేశారు. చంద్రబాబు చెప్పిన అవాస్తవాలను ప్రముఖంగా ప్రచురిస్తున్నాయంటూ మంత్రి దుయ్యబట్టారు

టీడీపీపై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ కావాలనే విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. పేదలకు కట్టిస్తున్న ఇళ్లపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి విమర్శించారు. ఏడాదిలోనే ఇళ్లు కట్టిస్తామని చెప్పి గత సర్కార్ హడావిడి చేసిందని బొత్స ఎద్దేవా చేశారు. పడిపోయిన టీడీపీని లేపడానికి ఎల్లో మీడియా ప్రయత్నం చేస్తోందంటూ సత్యనారాయణ చురకలు వేశారు. చంద్రబాబు చెప్పిన అవాస్తవాలను ప్రముఖంగా ప్రచురిస్తున్నాయంటూ మంత్రి దుయ్యబట్టారు.

రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తున్నామని.. ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఇచ్చామని బొత్స గుర్తుచేశారు. వైఎస్ఆర్ హయాంలో 21 లక్షలకు పైగా ఇళ్లను కట్టించారని.. చంద్రబాబు హయాంలో 6 లక్షల ఇళ్లనే కట్టించారని మంత్రి లెక్కలు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ 28 లక్షల 30 వేల ఇళ్లను కట్టిస్తున్నారని... రాష్ట్రంలో కొత్తగా 15 వేల ఊర్లను సృష్టిస్తున్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు. పేదలకు 10 వేల కోట్ల విలువైన భూములను అందించామని మంత్రి వెల్లడించారు. 
 

click me!