సీఎం ఆఫీసు నుంచి జన్మభూమి కమిటీల దాకా అవినీతే: టీడీపీపై బొత్స వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jun 12, 2020, 6:32 PM IST
Highlights

అచ్చెన్నాయుడి అరెస్ట్ విషయంలో టీడీపీ ఆరోపణలు సరికాదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పక్కా ఎవిడెన్స్‌తో ఏసీబీ అరెస్టులు చేస్తోందని.. దీనిని తప్పుబట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

అచ్చెన్నాయుడి అరెస్ట్ విషయంలో టీడీపీ ఆరోపణలు సరికాదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పక్కా ఎవిడెన్స్‌తో ఏసీబీ అరెస్టులు చేస్తోందని.. దీనిని తప్పుబట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ దోపిడీలపై విచారణ జరుపుతున్నామని.. దీనిపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు.

తెలుగు దేశం నేతలంతా భూముల కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని బొత్స ఎద్దేవా చేశారు. సీఎం కార్యాలయంల నుంచి జన్మభూమి కమిటీల వరకు అవినీతి జరిగిందని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. 

ఎవరి మీదా తమకు కక్ష లేదని.. ఎన్నికల సమయంలో టీడీపీ అవినీతిని బయటకు తీస్తామని చెప్పిన మాట ప్రకారమే ముందుకు వెళ్తున్నామని బొత్స  స్పష్టం చేశారు. టీడీపీ నేతలు నేరం చేయకపోతే తమ నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు.

తెలుగుదేశం హయాంలో ప్రతి చిన్న పనికి ముట్టజెప్పాల్సిందేనని బొత్స ఆరోపించారు. ప్రజలు అందరికన్నా తెలివైనవారని, సమాజంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. అవినీతి విషయంలో తాము ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే చర్యలు  తీసుకుంటున్నాం తప్పించి, చంద్రబాబులాగా దొంగకేసులు పెట్టలేదని బొత్స అన్నారు. 
 

click me!