
అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోనే కేంద్ర ప్రభుత్వంతో విభేదించామని... బిజెపితో తమకెలాంటి విబేధాలు లేవన్న టిడిపి చీఫ్ చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు మళ్లీ బిజెపితో కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని... ఆ పార్టీ గేట్లు తెరిస్తే దూరాలని చూస్తున్నాడని బొత్స అన్నారు. ఇలా ఎవరో గేట్లు తెరుస్తారని డిల్లీ చుట్టు తిరుగుతున్న చంద్రబాబు టిడిపి గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని అనడం విడ్డూరంగా వుందని బొత్స ఎద్దేవా చేసారు.
వచ్చేఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఒంటరిగానే పోరాటం చేసి ప్రజలను మెప్పిస్తుందని మంత్రి బొత్స పేర్కొన్నారు. వచ్చే ఉగాది తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో కనుచూపుమేరలో కనపడదని అన్నారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైసిపి పార్టీయే... గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు కూడా టిడిపికి రావని బొత్స అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ గురించి చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని మంత్రి హెచ్చరించారు. మాజీ సీఎం, ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా చంద్రబాబు బాధ్యతాయుతంగా మాట్లాడాలని... సంయమనంతో వుండాలని బొత్స సూచించారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు మతిపోయినట్లు మాట్లాడుతున్నాడని అన్నారు.
Read More కోడికత్తిని అందించింది మంత్రి బొత్స సత్యనారాయణ మేనళ్లుడు మజ్జి శ్రీనివాసరావ్ - న్యాయవాది సలీం
చంద్రబాబు ముసలి జిత్తులమారి నక్క అని బొత్స మండిపడ్డారు. మనిషికి వయసు, అనుభవం వుంటే సరిపోదు పరిపక్వత ఉండాలని... చంద్రబాబుకు అది లేదన్నారు. ఇకనైనా సీఎం జగన్ గురించి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చంద్రబాబుకు బొత్స హెచ్చరించారు.
చంద్రబాబుతో పాటు మరికొన్ని దుష్టశక్తులు ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని బొత్స ఆరోపించారు. ఇలాంటి పార్టీలను ప్రజలు నమ్మబోరని అన్నారు. రానున్న ఎన్నికల ద్వారా ప్రజాక్షేత్ర౦లో ఎవరి సత్తా ఏంటో తేలుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.