జనం ఓడించినా మారలేదు.. విభజన కన్నా బాబు చేసిన నష్టమే ఎక్కువ: బొత్స

Siva Kodati |  
Published : Oct 23, 2019, 06:36 PM IST
జనం ఓడించినా మారలేదు.. విభజన కన్నా బాబు చేసిన నష్టమే ఎక్కువ: బొత్స

సారాంశం

బాబు తన వియ్యంకుడికి రాజధాని పక్కన ఐదు వేల ఎకరాలు కేటాయించారని.. ప్రజలందరికీ అందుబాటులో ఉండే రాజధానిని నిర్మిస్తామని సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర విభజన కన్నా చంద్రబాబు చేసిన నష్టమే ఎక్కువంటూ ఆయన దుయ్యబట్టారు. వ్యక్తిగత ఆరాధన కోసం వ్యవస్ధలను చిన్నాభిన్నం చేసి నేడు గగ్గోలు పెడుతున్నారని బొత్స మండిపడ్డారు.

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు.

ఐదేళ్లలో లక్షా 65 వేల కోట్ల అప్పులు చేశారని.. అమరావతిలో ఒక్క శాశ్వత కట్టడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలు చిత్తుగా ఓడించినా చంద్రబాబులో మార్పు రాలేదని.. వైసీపీ హయాంలోనే రాజధానిని పూర్తి చేస్తామని బొత్స స్పష్టం చేశారు.

బాబు తన వియ్యంకుడికి రాజధాని పక్కన ఐదు వేల ఎకరాలు కేటాయించారని.. ప్రజలందరికీ అందుబాటులో ఉండే రాజధానిని నిర్మిస్తామని సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర విభజన కన్నా చంద్రబాబు చేసిన నష్టమే ఎక్కువంటూ ఆయన దుయ్యబట్టారు.

వ్యక్తిగత ఆరాధన కోసం వ్యవస్ధలను చిన్నాభిన్నం చేసి నేడు గగ్గోలు పెడుతున్నారని బొత్స మండిపడ్డారు. 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని అలాంటప్పుడు అది చూపించాలని బొత్స నిలదీశారు. అమరావతి అందరిదీని.. కొందరిదే కాదన్న సంగతిని చంద్రబాబు గుర్తుంచుకోవాలని తెలిపారు.

Also Read:ఈనాడుకు ప్రభుత్వ యాడ్స్ ఎందుకు ఇస్తున్నామంటే..: బొత్స

నిపుణుల కమిటీ రాష్ట్రం మొత్తం పర్యటించి రాజధానిని, అభివృద్ధి వికేంద్రీకరణను నిర్ణయిస్తుందని.. తద్వారా 13 జిల్లాలను అభివృద్ధి చేస్తామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న సీఎం జగన్‌ను వాడు, వీడు అంటూ ఏకవచనంతో సంభోదించడం సరికాదని బొత్స చురకలంటించారు.

చంద్రబాబు కడుపుమంటతో మాట్లాడుతున్నారని.. ఆయన ఆలోచనలు, మోసం, దగా గమనించే జనం ఓడించారని మంత్రి విమర్శించారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను జగన్ నెరవేరుస్తున్నారని... వ్యవస్థలను చక్కదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారని బొత్స స్పష్టం చేశారు. 

అధ్యయన కమిటీ సూచనలు, సిఫార్సులపై మంత్రి వర్గంలో చర్కచించి ప్రజాభిప్రాయసేకరణ చేపట్టి అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. బొత్స చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళంలోకి నెట్టేసినట్లు ఉన్నాయి. ఇంతకీ రాజధాని మఅరావతిలో ఉన్నట్లా లేక లేనట్లా అన్న సందేహం మళ్లీ ప్రజల్లో నెలకొనేలా వ్యాఖ్యలు చేశారు. 

Also Read:రాజధానిగా అమరావతి డౌటే, సాకులు చెప్తున్న ప్రభుత్వం: బొత్స సంచలన వ్యాఖ్యలు

అంతేకాదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రాయలసీమలో పెట్టాలని కొందరు అమరావతిలోనే కొనసాగించాలని మరికొందరు అలాగే ఉత్తరాంధ్రలో పెట్టాలని ఇంకొందరు ఇలా ఉద్యమాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అధ్యయన కమిటీ ప్రాంతాల వారీగా వారి అభిప్రాయాలను కూడా పరిశీలనలో తీసుకోనున్నట్లు తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై పీటర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అవసరానికి మించి రెట్టింపు వ్యయం చేశారని.. రాజధానిలోని ప్రతి ప్రాజెక్ట్, నిర్మాణాలను సమీక్షించాలని కమిటీ నివేదికలో వెల్లడించింది. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు.

ప్రతి నిర్మాణాలను పున: సమీక్షించాలని కమిటీ స్పష్టం చేసింది. సుమారు రూ.30 వేల కోట్లను దుబారా చేశారని నివేదికలో వెల్లడించారు. రాజధాని, ప్రాజెక్టులు, నిర్మాణాలు, అవకతవకలపై ఏర్పాటైన ఈ కమిటీలో పీటర్, పొన్నాడ సూర్యప్రకాశ్, అబ్ధుల్ బషీర్, నారాయణరెడ్డి, ఇయాన్ రాజు, ఆదిశేషు సభ్యులుగా ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vishnu Kumar Raju Speech: వీటిపై ఇంత తక్కువ డబ్బు కేటాయించడం నేనెప్పుడూచూడలేదు | Asianet News Telugu
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు