సీబీఐ కేసులున్న జగన్ కేంద్రంతో..... పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Oct 23, 2019, 5:17 PM IST
Highlights

సీబీఐ కేసులు ఉన్నాయి కాబట్టే జగన్ వెనుదిరగాల్సి వచ్చిందన్నారు. సీబీఐ కేసులు లేకపోతే కేంద్రాన్నే నిలదీసే పరిస్థితికి వెళ్లేవారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రాన్ని నిలదీయలేక రాజీపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీబీఐ కేసులున్న వ్యక్తి సీఎం అయితే ఏపని సక్రమంగా చేయలేరని, రాష్ట్రానికి ఏమీ చేయలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెళ్తే కేంద్రమంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేని దుస్థితి అని చెప్పుకొచ్చారు. కేసులు ఉన్నాయి కాబట్టే వారితో జగన్ కొట్లాడలేరని విమర్శించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా కావాలని కేంద్రాన్ని నిలదీయాలంటే సీబీఐ కేసులు అడ్డువస్తాయని వారు గుర్తు చేశారంటే వెనక్కి తగ్గాల్సిందేనన్నారు. అందుకు నిదర్శనమే రెండు రోజుల క్రితం న్యూ ఢిల్లీలో సీఎం జగన్ కు ఎదురైన అనుభవమేనని చెప్పుకొచ్చారు. 

కేంద్రమంత్రులను కలిసేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని కానీ అక్కడ అపాయింట్మెంట్ దొరక్క ఒక్కరోజంతా తన అధికారిక గృహంలోనే గడపాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మరుసటి రోజు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలు అపాయింట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత క్యాన్సిల్ చేయడం బాధాకరమన్నారు.

సీబీఐ కేసులు ఉన్నాయి కాబట్టే జగన్ వెనుదిరగాల్సి వచ్చిందన్నారు. సీబీఐ కేసులు లేకపోతే కేంద్రాన్నే నిలదీసే పరిస్థితికి వెళ్లేవారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రాన్ని నిలదీయలేక రాజీపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చినప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై కోడికత్తితో దాడి చేసిన కేసు ఏమైందన్నారు. కోడికత్తి దాడి కేసులో ఆంధ్రాపోలీసులపై నమ్మకం లేదని సీబీఐ కోర్టుకు వెళ్తామన్న జగన్ ఆ విషయాలను అధికారంలోకి వచ్చిన వెంటనే మరచిపోయారన్నారు. 

ఇకపోతే ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత చిన్నాన్న మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేసినా దానిపై ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదన్నారు. సీబీఐ విచారణ కోరిన సీఎం జగన్ ఇప్పుడు ఆ కేసును ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. 

ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కేసుల విషయం మరచిపోయారా...? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన డిమాండ్లు గుర్తుకు రావడం లేదా అని నిలదీశారు. జగన్ మరచిపోయినా తాను మరచిపోలేదని తనుకు అన్నీ గుర్తున్నాయన్నారు.

తనకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అయినా, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అయినా గౌరవమేనని చెప్పుకొచ్చారు. వారితో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. 151 సీట్లతో అఖండ విజయం సాధించడంతో మరో 20ఏళ్లు సీఎంగా జగనే ఉంటారని తాను రోడ్లెక్కాల్సిన పనిలేదనుకున్నానని చెప్పుకొచ్చారు. 

అయితే 100 రోజులకే తనను రోడ్లపైకి వచ్చేలా సీఎం జగన్ చేశారని చెప్పుకొచ్చారు. జగన్ పాలనలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. 

ఏపీలో ఇసుక దొరకడం లేదు గానీ ఏపీ ఇసుక మాత్రం ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందన్నారు. ఇసుకమాఫియాను అరికడతామన్న జగన్ ఎక్కడా ఆ దిశగా అడుగులు వేయడం లేదని నిలదీశారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక మాఫియా చేస్తుంటే ఈనాడు వైసీపీ నాయకులు చేస్తున్నారని తిట్టిపోశారు. 

భవన నిర్మాణ కార్మికులకు అండగా తాను ఈనెల 3న విశాఖపట్నంలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అందుకు అంతా సహకరించాలని దాన్ని విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. 

వైసీపీ ప్రభుత్వంలో నాయకులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులపైనా, జర్నలిస్టులపైనా దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. 

ఈ వార్తలను కూడా చదవండి

ఓడిపోతే బెంబేలెత్తిపోను, తలదించను: పవన్ కళ్యాణ్

click me!