తనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఎవరో తమపై స్వారీలు చేయడానికి తాము చిన్న పిల్లలమా అని ఆయన ప్రశ్నించారు. బీసీలకు ఎన్టీఆర్ చేసినదానిని చంద్రబాబు చెప్పుకోవడం ఏంటని మంత్రి మండిపడ్డారు.
ప్రతిపక్షనేత , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు మంత్రి బొత్స సత్యనారాయణ. శనివారం ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ .. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది చంద్రబాబేనన్నారు. ఉత్తరాంధ్రను దోచుకోవడానికి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వచ్చారంటున్న చంద్రబాబు.. వారేం చేశారో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. తమ శాఖలపై వారు స్వారీ చేయడానికి తామేమైనా చిన్న పిల్లలమా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు రాజులకు పదవులు అప్పగించారని.. అప్పట్లో వైసీపీ నుంచి కొందరినీ టీడీపీలోకి చేర్చుకోలేదా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అమరావతి పేరిట లక్షల కోట్ల ప్రజాధనాన్ని మట్టి పాలు చేశారని బొత్స మండిపడ్డారు. త్వరలోనే విశాఖకు రాజధాని తరలివస్తుందని ఆయన జోస్యం చెప్పారు. బీసీలకు ఎన్టీఆర్ చేసినదానిని చంద్రబాబు చెప్పుకోవడం ఏంటని మంత్రి మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నట్లు నిజాలు మాట్లాడకూడదని చంద్రబాబుకు శాపం వున్నట్లుగా వుందని బొత్స చురకలంటించారు.
అంతకుముందు చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు ఏపీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు మాదిరిగా తనకు వేరే రాష్ట్రం, వేరే పార్టీ లేదన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని కూడా తాను అనడం లేదని సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక్కడే నివాసం ఉంటానని ఆయన తేల్చి చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో కృష్ణా నది నీళ్లను కడప జిల్లాకు తీసుకు వచ్చారన్నారు. అంతకు ముందు ఎంతమంది సీఎంలున్నా కూడా జిల్లాకు కృష్ణా నది నీళ్లు తేలేదన్నారు.
Also REad: చెడిపోయిన వ్యవస్ధతో యుద్ధం చేస్తున్నాం, గ్లాసులో నీళ్లున్నా.. లేవంటారు : చంద్రబాబుపై జగన్ విమర్శలు
వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే కడప జిల్లాలో ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని ఆయన చెప్పారు. గతంలో ఎవరూ కూడా ఇక్కడి ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. గాలేరు నగరిని తీసుకువచ్చేందుకు వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ కృషితోనే గండికోట ప్రాజెక్టు పూర్తైందన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జిల్లాకు చెందిన ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయిందని జగన్ చెప్పారు.
చిత్రావతి ప్రాజెక్టులో నీరు నిల్వ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే చిత్రావతి ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసినట్టుగా సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రంలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ విషయాన్నిఅప్పటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలోని నేతలు కూడా పట్టించుకోలేదని సీఎం జగన్ విమర్శించారు.కడపలో రూ. 8800 కోట్లతో స్టీల్ ప్యాక్టరీని నిర్మించనున్నట్టుగా సీఎం ప్రకటించారు.