క్షుద్రపూజల కలకలం : మొన్న మదనపల్లె.. నిన్న గాజువాక.. !!

By AN TeluguFirst Published Feb 2, 2021, 2:03 PM IST
Highlights

చిత్తూరు జిల్లా మదనపల్లెలో మూఢనమ్మకాలతో సొంత కూతుళ్లనే చంపుకున్న ఘటన మరువకముందే గాజువాకలో క్షుద్రపూజల కలకలం భయాందోళనకు గురిచేసింది. విశాఖపట్నం నగర శివారునున్న గాజువాక అజీమాబాద్‌లోని ఓ కుటుంబం అర్థరాత్రి పూజలు చేశారు. ఈ వార్త  స్థానికంగా కలకలం రేపింది. 

చిత్తూరు జిల్లా మదనపల్లెలో మూఢనమ్మకాలతో సొంత కూతుళ్లనే చంపుకున్న ఘటన మరువకముందే గాజువాకలో క్షుద్రపూజల కలకలం భయాందోళనకు గురిచేసింది. విశాఖపట్నం నగర శివారునున్న గాజువాక అజీమాబాద్‌లోని ఓ కుటుంబం అర్థరాత్రి పూజలు చేశారు. ఈ వార్త  స్థానికంగా కలకలం రేపింది. 

వీరింట్లో క్షుద్రపూజలు జరుగుతున్నాయని ప్రచారం జరిగింది. అయితే మానసిక రుగ్మత కారణంగానే అలా ప్రవర్తిస్తున్నట్లు వైద్యులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. 

వివరాల్లోకి వెడితే.. గాజువాక అజీమాబాద్‌ ప్రాంతంలో అబ్దుల్ మజీద్ (46), ఆయన భార్య మెహ్రు (40), వీరి కొడుకు నూరుద్దీన్ (24), కుమార్తె నూరి(20)లు నివాసం ఉంటున్నారు. గత ఆదివారం అర్థరాత్రి సమయంలో మజీద్ తన కుటుంబంతో కలిసి గట్టిగా మంత్రాలు చదివాడు. 

ఈ సమయంలో మజీద్ అన్న వలీ అక్కడికి వెళ్లాడు. తమ్ముడి ఇంటికి ఎంతసేపు తలుపుకొట్టినా తెరవలేదు. దీంతో వలీ వెనుదిరిగి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం వలీ మరోసారి వచ్చాడు. అప్పుడు కూడా ఇంట్లో నుంచి మంత్రాలు వినిపిస్తున్నాయి. 

అనుమానం వచ్చిన వలీ తలుపులు తెరవమని అడిగాడు. కానీ ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో స్థానికులతో విషయం చెప్పి తీసుకెళాడు. అందరూ కలిసి తలుపులు తీయాల్సిందిగా ఒత్తిడి చేశారు. 

అయితే వీరి మాటలకు లోపలి వాళ్లు స్పందించారు. బలవంతంగా తలుపులు తెరిచేందుకు ప్రయత్నిస్తే గొంతు కోసుకుని చచ్చిపోతామంటూ హెచ్చరించారు. దీంతో ఏం చేయాలో పాలుపోక పోలీసులకు సమాచారం అందించారు. 

వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ఇంటికి చేరుకుని, బలవంతంగా తలుపులు తెరిపించారు. కుటుంబ సభ్యులను అతి కష్టంమ్మీద బైటికి తీసుకువచ్చారు. ఆ నలుగురిని నేరుగా గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వీరిని పరీక్షించిన వైద్యులు మానసిక రుగ్మత కారణంగానే వీరిలా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. 

బంధువులు ఆ నలుగురినీ చికిత్స కోసం విశాఖపట్నంలోని ప్రభుత్వ మానసిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో అబ్దుల్ మజీద్ ఆటో నడుపుతుండగా, కొడుకు నూరుద్దీన్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కుమార్తె నూరీ డిప్లొమా చదువుతుంది. 

ఎలాంటి గొడవలు లేకుండా హాయిగా ఉండే కుటుంబం ఒక్కసారిగా వింతగా ప్రవర్తించడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరిమీద ఎలాంటి కేసు నమోదు చేయలేదని గాజువాక లా అండ్‌ ఆర్డర్‌ సీఐ హెచ్‌.మల్లేశ్వరరావు తెలిపారు. 
 

click me!