రెడ్ జోన్ ప్రాంతాల్లోనూ మాంసం విక్రయాలు: ఉప ముఖ్యమంత్రి ప్రకటన

Published : Apr 28, 2020, 09:52 PM IST
రెడ్ జోన్ ప్రాంతాల్లోనూ మాంసం విక్రయాలు: ఉప ముఖ్యమంత్రి ప్రకటన

సారాంశం

రంజాన్ మాసంలో ముస్లీంల ఉపవాస దీక్షలను దృష్టిలో వుంచుకుని నిబంధనలకు లోబడి మాంసం విక్రయాలకు అనుమతిస్తున్నట్లు మంత్రి అంజాద్ బాష వెల్లడించారు. 

కడప: ప్రజల ఆకాంక్ష మేరకు ఈనెల 29వ తేదీ నుంచి పట్టణంలో నిబంధనల ప్రకారం మాంసం విక్రయాలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ భాష పేర్కొన్నారు.  తన నివాసంలో  మాంసం విక్రయదారులతో ఉప ముఖ్యమంత్రి   సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా వైరస్ ప్రభావంతో గత నలభై రోజులుగా పట్టణంలో లాక్ డౌన్ నిర్వహించడం జరిగిందన్నారు. లాక్ డౌన్ నిర్వహించినప్పటి నుంచి కొంతమంది మాంసం ప్రియులు మటన్, చికెన్ కొరకు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

ప్రస్తుత రంజాన్ మాసంలో ముస్లింలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసము  ఉంటారన్నారు. ఉపవాసం ఉండడంవల్ల మనిషి కొంత అలసటకు గురవుతారన్నారు. దీంతో పౌష్టికాహారానికి సంబంధించిన మాంసకృత్తులు తీసుకోవడంవల్ల మనిషి ఆరోగ్యకరంగా ఉంటారన్నారు. అంతేకాకుండా కరోనా దరిచేరకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మంచి ఆహారం తీసుకోవాలన్నారు. 

ఇందువల్ల కడప పట్టణంలో మాంసం కూడా విక్రయాలు జరపాలని ప్రభుత్వానికి తెలియజేయడంతో నిబంధనలు ఉల్లంఘించకుండా మాంసం విక్రయాలు జరుపుకోవచ్చనని పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో పట్టణంలో మాంసం విక్రయాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
 కావున మాంసం విక్రయదారులు ప్రతిరోజు ఉదయం 6-00 గంటల నుంచి ఉదయం 9-00గంటల వరకు తమకు నిర్దేశించిన ప్రాంతాలలో మాంసం విక్రయించుకోవచ్చునన్నారు. 

రెడ్ జోన్ ఏరియాలలో అధికారులు సూచించిన 4 ప్రాంతాలలో మాత్రమే మాంసం విక్రయించుకోవాలన్నారు. గ్రీన్ జోన్ ఏరియాలలో తమ దుకాణాలవద్ద సామాజిక దూరం పాటించి మాంసం విక్రయించు కోవచ్చునన్నారు.రెడ్ జోన్ ఏరియాలకు సంబంధించి(1). మున్సిపల్ గ్రౌండు (2). సి ఎస్ ఐ గ్రౌండ్ (3). మరియాపురం హై స్కూల్ గ్రౌండ్ (4). కాగితాల పెంట సి కె కళ్యాణ మండపం ఖాళీ స్థలం.  ఈ ప్రాంతాలలో మాంసం విక్రయాలు జరుపుకోవచ్చునన్నారు. 

మాంసం విక్రయదారులు తప్పకుండా స్థానిక తాసిల్దార్ నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నారు. ప్రతి మాంసం దుకాణం ముందు చికెన్, మటన్ రేట్ల వివరాలు రాయించాలన్నారు. ప్రతిరోజు మటన్ కిలో ఏడు వందల కంటే ఎక్కువ ధరకు అమ్మరాదన్నారు. చికెన్ మాత్రం ఏరోజుకారోజు మార్కెట్ రేట్లను బట్టి ధర నిర్ణయించడం జరుగుతుందన్నారు. 

ఉదయం 3-00 గంటల నుంచి ఉదయం 6-00 గంటల వరకూ జంతువదశాలలు తెరవడం జరుగుతుందన్నారు, ఇక్కడ మటన్ విక్రయదారులు మటన్ తీసుకుని తనకు కేటాయించిన ప్రాంతాలలో  విక్రయించుకోవచ్చునన్నారు.

ఈ సమావేశంలో ఆర్ డి ఓ మాలోల, మున్సిపల్ కమిషనర్ లవన్న, డి.ఎస్.పి సూర్యనారాయణ, తాసిల్దార్ శివరామిరెడ్డి, 31 వ డివిజన్ ఇంచార్జి అజ్మతుల్లా, కటిక సంఘం అధ్యక్షులు మూస సేట్, 28 వ డివిజన్ ఇంచార్జి ఆరీపుల్ల, సికిందర్, మాంసం విక్రయదారులు తదితరులు పాల్గొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

ప్రలోభాలకు లోనై జీవితాలు నాశనం చేసుకోవద్దు | HM Anitha Strong Warning To Constable Candidates
Chinthamaneni Prabhakar Sensational Comments On YS Jagan | Asianet Telugu