పచ్చజెండా ఊపితే టీడీపీ ఖాళీ: మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్య

Published : Jul 13, 2019, 12:19 PM IST
పచ్చజెండా ఊపితే టీడీపీ ఖాళీ: మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్య

సారాంశం

తమ పార్టీ అధిష్టానం పచ్చ జెండా ఊపితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని, అధిష్టానం అనుమతి కోసం వేచి చూస్తున్నామని బిజెపి నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు అన్నారు. 

ధవళేశ్వరం: తమ పార్టీ అధిష్టానం పచ్చ జెండా ఊపితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని, అధిష్టానం అనుమతి కోసం వేచి చూస్తున్నామని బిజెపి నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు అన్నారు. 2024లో అధికారం చేపట్టే దిశగా పార్టీని బలోపేతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలోని అవినీతిని బయటపెట్టి, అందుకు కారణమైన అధికారులపై, ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.  

శుక్రవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు దిశా నిర్దేశం కార్యక్రమంలో మాణిక్యాలరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆశాజనకంగా లేదని, అది కంటి తడుపు బడ్జెట్ మాత్రమేనని మాణిక్యాలరావు అన్నారు. ప్రతిపక్ష నేతగా టీడీపీ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు చేసిన జగన్‌ ముఖ్యమంత్రిగా గత ప్రభుత్వ అవినీతిని వెలికితీసి చర్యలు తీసుకోగలిగే పరిస్థితి ఉందా అని అడిగారు. 

రాష్ట్రంలో కరువ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రజలు వలసపోతున్నారని, నీటి ఎద్దడి, కరువు నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు.

టీడీపీ నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారని, అధిష్టానం అనుమతి ఇస్తే భారీగా చేరికలు ఉంటాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజల పక్షం వహించి ప్రభుత్వం ప్రజాహిత నిర్ణయాలు తీసుకుంటే మద్దతు ఇస్తామని ప్రజావ్యతిరేక నిర్ణయాలు, అవినీతిపై ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu