తెనాలి: కోర్టు వద్ద హైటెన్షన్.. ఆత్మహత్య చేసుకుంటానంటూ, పెట్రోల్‌ బాటిల్‌తో వ్యక్తి హల్‌చల్

By Rajesh KFirst Published Jan 21, 2022, 12:00 AM IST
Highlights

గుంటూరు (guntur) జిల్లా తెనాలిలోని (tenali court) కోర్టు వద్ద గురువారం పెట్రోల్ బాటిల్‌తో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య (suicide attempt) చేసుకుంటానని బెదిరించాడు. 

గుంటూరు (guntur) జిల్లా తెనాలిలోని (tenali court) కోర్టు వద్ద గురువారం పెట్రోల్ బాటిల్‌తో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య (suicide attempt) చేసుకుంటానని బెదిరించాడు. ఇదే నెలలో ఒక అధ్యాపకుడు కోర్టు ప్రాంగణంలో పెట్రోల్‌తో నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడే విధుల్లో వున్న పోలీసులు, న్యాయవాదులు ఆందోళనకు గురయ్యారు.

తెనాలి వన్‌టౌన్ పోలీసులు తనను వేధిస్తున్నారంటూ చెరుకూరి ప్రదీప్ రామచంద్ర అనే వ్యక్తి కోర్టు ప్రాంగణంలో పెట్రోల్ బాటిల్‌తో హల్‌చల్ చేశాడు. భార్యభర్తల మధ్య విభేదాల నేపథ్యంలో కోర్టులో కేసులు.. వన్‌టౌన్ పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. కోర్టు ఆవరణలో ఉన్న న్యాయవాదులు, పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకుండా ఒంటిపై పెట్రోల్ పోసుకుని.. దగ్గరకి వస్తే నిప్పంటించుకుంటానని బెదిరించాడు. దీంతో అక్కడే వున్న న్యాయవాది హరిదాసు గౌరీశంకర్ అతనిని చాకచక్యంగా అడ్డుకున్నారు. అనంతరం ప్రదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పీఎస్‌కు తరలించారు.

కాగా.. కొద్దిరోజుల క్రితం అప్పుల భారంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న తెనాలిలోని చినరావూరుకు చెందిన తాళ్లూరి జక్రయ్య కోర్టు ప్రాంగణంలో పెట్రోల్ పోసుకుని.. నిప్పంటించుకున్నాడు. ఈ నెల 6న జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దీనిని మరిచిపోకముందే మళ్లీ ఈ రోజు మరో వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడంతో అధికారులు, న్యాయవాదులు, పోలీసులు ఉలిక్కిపడ్డారు. 

click me!