వివాహేతర సంబంధం: కన్నకొడుకును హత్య చేయించిన తల్లి

By narsimha lodeFirst Published Jun 29, 2021, 9:24 AM IST
Highlights

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో కన్న కొడుకును కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించింది తల్లి. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో చోటు చేసుకొంది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కదిరి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో కన్న కొడుకును కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించింది తల్లి. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో చోటు చేసుకొంది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.కదిరి పట్టణంలోని కంచుకోటలోని బిలాల్ వీధికి చెందిన బాలసుబ్బలక్ష్మి భర్త వీరనారాయణ కొన్నేళ్ల క్రితం మరణించాడు.  అప్పటి నుండి ఆమె శ్రీనివాసులు అనే వ్యక్తితో  వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.  ఈ విషయం కొడుకు బాలచిన్నకు తెలిసింది. తల్లితో గొడవకు దిగేవాడు.  తల్లిని పద్దతి మార్చుకోవాలని హెచ్చరించాడు. కానీ ఆమె తన తీరును మార్చుకోలేదు.  

తన వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించిన తల్లి అతడిని అడ్డుతొలగించుకోవాలని భావించింది. ఈ విషయాన్ని తన ప్రియుడు శ్రీనివాసులకు చెప్పింది.కొడుకును చంపితే లక్షన్నర రూపాయాలు చెల్లిస్తానని ఆమె చెప్పింది. ఇందుకు కిరాయి హంతకులను మాట్లాడాలని కోరింది.  దీంతో శ్రీనివాసులు తన అల్లుడు ఆదినారాయణ, రామ్మోహన్, బిట్ర ప్రభాకర్ తో హత్య చేశారు.

బాల చిన్నను హత్య చేసేందుకు అతడితో పరిచయం పెంచుకొన్నారు. బాల చిన్నకు మద్యం తాగడం అలవాటు ఉంది. దీంతో మద్యంలో విషం కలిపి హత్యచేయాలని ప్లాన్ చేశారు. రెండుసార్లు ఈ ప్రయత్నం విఫలమైంది.  దీంతో ఈ నెల 16న బాల చిన్నను పోలేవాండ్లపల్లి సమీపంలోని ఆవుల చెరువు వద్దకు మద్యం తాగేందుకు తీసుకెళ్లారు.

మద్యం మత్తులో ఉన్న బాలచిన్నకు మద్యంలో విషం కలిపి తాగించారు. అతను అపస్మారకస్థితిలోకి చేరుకోగానే కర్రతో, బండరాళ్లతో హత్య చేశారు.పోలేవాండ్లపల్లి వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ మృతదేహన్ని చిన్న తల్లి సుబ్బలక్ష్మి, భార్య పవిత్ర గుర్తించారు.మృతుడి మొబైల్ కు వచ్చిన ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో  పోలీసులు షాకయ్యారు. కన్నతల్లే కొడుకును హత్య చేయించేందుకు సుఫారీ ఇచ్చిందని గుర్తించారు.

click me!