ఐదేళ్లు ప్రేమించి, పెళ్లి ముహూర్తం పెట్టాక.. తనకంటే నాలుగేళ్లు పెద్దదంటూ యువకుడి మోసం... యువతి ఆత్మహత్య..

By SumaBala BukkaFirst Published Jun 6, 2023, 6:52 AM IST
Highlights

ప్రేమించానని వెంటపడి.. పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నాక.. యువతి తనకంటే వయసులో పెద్దదంటూ..వేరే మహిళను పెళ్లిచేసుకున్నాడో ప్రబుద్ధుడు. 
 

కర్నూలు :  ఐదు రోజుల్లో పెళ్లి అనగా.. తనకు తాళి కట్టాల్సినవాడు మరో యువతిని పెళ్లి చేసుకుని వచ్చాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన  కర్నూలులో సోమవారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సదరు యువకుడు ఆ యువతిని ఐదేళ్లపాటు పెళ్లి పేరిట వెంటపడి.. ప్రేమించేలా చేసి పెళ్లికి  ఒప్పించాడు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించి.. నిశ్చితార్థం కూడా చేశారు.

ఈనెల 10వ తేదీన పెళ్లికి ముహూర్తం పెట్టారు. కాగా, యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకుని వచ్చాడు. ఇది తెలిసి ఆ యువతి తట్టుకోలేక విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ విషాదమైన ఘటనలో వివరాలను పోలీసులు ఇలా తెలిపారు. కర్నూలులోని పీవీ నరసింహారావు కాలనీకి చెందిన మల్లెపోగు మధు,షేకమ్మ దంపతులు. వీరి కుమార్తె పద్మావతి (30). డిగ్రీ వరకు చదువుకుంది.

ఐదురోజుల్లో పెళ్లనగా యువకుడు ట్విస్ట్... కర్నూల్ యువతి సూసైడ్

ఆ తర్వాత పదేళ్లుగా వెహికల్ షో రూమ్ లో పనిచేస్తుంది. వినోద్ కుమార్ అలియాస్ ప్రవీణ్ కుమార్ అదే షోరూంలో పనిచేసేవాడు. ఐదేళ్ల క్రితం  అతను అక్కడ చేరాడు. అతనిది నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాతకోట. పద్మావతిని చూసి ఇష్టపడ్డాడు. ప్రేమించాను అంటూ వెంటపడేవాడు. ఆమె కూడా నమ్మింది. ఇద్దరూ కలిసి తిరిగేవారు.  కొద్ది రోజుల తర్వాత  వినోద్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పరిధిలోని కియా షోరూంలో ఉద్యోగం వస్తే వెళ్ళాడు. 

అయినాకూడా పద్మావతితో టచ్ లోనే ఉండేవాడు. తరచుగా ఫోన్ చేసేవాడు. అలా ఐదేళ్లపాటు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. తమ ప్రేమ గురించి పెద్దలకు కూడా చెప్పారు. వారు ఒప్పుకొని మార్చి తొమ్మిదవ తేదీన నిశ్చితార్థం చేశారు. పద్మావతి తల్లిదండ్రులు వరకట్నంగా రూ. లక్ష నగదు. బంగారం ఇస్తామని  ఒప్పుకున్నారు. జూన్ 10న పెళ్లికి  ముహూర్తం నిశ్చయించి లగ్నపత్రిక  రాయించారు.

ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. వినోద్ కుమార్ ఇటీవల పద్మావతి తన కంటే వయసులో నాలుగేళ్లు పెద్దదని, తనను బలవంతంగా ఒప్పించి నిశ్చితార్థం చేయించారంటూ జూపాడుబంగ్లా ఠాణాలో ఇటీవల ఫిర్యాదు చేశాడు. అంతేకాదు మే 29న వెంకాయపల్లె ఎల్లమ్మ ఆలయంలో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.  ఈ సమాచారం కూడా వారికి ఇచ్చాడు.

కాబోయే అల్లుడు చేసిన పనికి షాక్ అయిన పద్మావతి తల్లిదండ్రులు దిశా మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. దీని మీద సోమవారం విచారణ జరగాల్సి ఉండగా.. ఇంతలోనే పద్మావతి ఆత్మహత్య చేసుకుంది. ఆమె విషం తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికి ఆమె పరిస్థితి విషమించడంతో మృతి చెందింది.

ఆమె రాసిన సూసైడ్ నోట్ లభించిందని నాలుగో పట్టణ ఎస్ఐ మోహన్ కిషన్ రెడ్డి తెలిపారు. అందులో ఆ యువతి ఇలా రాసింది..‘అమ్మ నాన్న నన్ను క్షమించండి. మీరు చెప్పిన మాట వినలేదు. అందుకే నాకు తగిన శాస్తి జరిగింది. తమ్ముడు చెల్లి గురించి ఆలోచించండి. నా గురించి బాధపడొద్దు. నా చావుకు కారణం వినోద్ ను ప్రేమించడమే. అతను నన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటూ ఐదేళ్లు వెంటపడ్డాడు.

నేను అతడిని గుడ్డిగా నమ్మాను. మిమ్మల్ని ఒప్పించాను. నిశ్చితార్థం చేసుకుని లగ్నపత్రిక రాయించుకున్నాం. తీరా పెళ్లి పత్రికలు కూడా ఆ చేయించుకున్న తర్వాత.. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. ఇంత మోసం చేయడం నేను భరించలేకపోతున్నాను.  అందుకే చనిపోవాలనుకుంటున్నాను. నా చావుకు కారణం వినోద్,  అతని తల్లిదండ్రులు లక్ష్మీదేవి, బక్కన్న, బావ శోభన్, చిన్నాన్న మధుబాబు, ఐదుగురు మేనత్తలు’ అని ఆ లేఖలో పేర్కొంది. తల్లిదండ్రులనుండి సేకరించిన ఈ  లెటర్ తో.. అందులో పేర్కొన్న వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

click me!