తిరుపతి ఉప ఎన్నిక వేళ జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు సముచిత గౌరవం ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ కల్యాణ్కు లేఖ రాశారు
తిరుపతి ఉప ఎన్నిక వేళ జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు సముచిత గౌరవం ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ కల్యాణ్కు లేఖ రాశారు.
పవన్ పిలుపుతో మూడేళ్ల క్రితం తాను జనసేనలో చేరానని... కొందరికే గౌరవం ఇస్తూ పార్టీ బలోపేతానికి కష్టపడే వారిని పవన్ పట్టించుకోవడంలేదని గంగాధరం వాపోయారు.
ఆ లేఖలో మాదాసు ఏమన్నారంటే ‘‘ఇప్పటివరకూ పార్టీ నిర్మాణంపై పవన్ దృష్టి పెట్టలేదు. అన్ని స్థాయిల్లో పార్టీకి కమిటీలు వేయలేదు. పార్టీ సభ్యత్వం, గ్రామ కమిటీల ఏర్పాటు లేకుండానే కొన్ని ప్రాంతాల్లో క్రియాశీల సభ్యత్వం చేయించారు.
అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. పార్టీ విధివిధానాలు కూడా ఖరారు చేయలేదు. పవన్ పోటీ చేసిన గాజువాకలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చాలా ఎక్కువగా ఉన్నారు. వారికి అండగా నిలవాల్సిన బాధ్యత పవన్పై ఉంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ పెద్దల నుంచి స్పష్టమైన హామీ తీసుకోలేదు. సినిమా ప్రపంచం వేరు. రాజకీయ ప్రపంచం వేరు. ఈ రెండింటికీ తేడా తెలియకుండా వ్యవహరిస్తే నాబోటి సీనియర్లు మీతో కలిసి పని చేయలేరు.
జనసేన ఓ రాజకీయ పార్టీగా పని చేయడం లేదు. పార్టీలో ఒక్కరికి మినహా మిగతా వ్యక్తులకు విలువ లేకుండా చేయడం సమంజసం కాదు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నా.’’ అని పేర్కొన్నారు.