
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం నిత్యం వార్తల్లో వుంటుంది. హేమాహేమీలు ఈ సెగ్మెంట్ నుంచి ప్రాతినిథ్యం వహించారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి మడకశిర నుంచి బలమైన నేతగా ఎదిగారు. 1989లో మొదలైన రఘువీరా శకం 2004 వరకు కొనసాగింది. 2009లో ఆయన కళ్యాణదుర్గానికి మారినా మడకశిరపై పట్టు మాత్రం కోల్పోలేదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో రఘువీరా రెడ్డి బెర్త్ సంపాదించి రాష్ట్రవ్యాప్త నేతగా ఎదిగారు. ఒకనొక దశలో ఆయన పేరు సీఎం రేసులోనూ నిలిచింది. మడకశిర నియోజకవర్గం 2009 వరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.
మడకశిర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్దే హవా :
1952లో ఏర్పడిన మడకశిర తొలినాళ్లలో జనరల్గా వుండేది.. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఈ సెగ్మెంట్ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,01,824 మంది. మడకశిర, అనంతపురం, గుదిబండ, రోళ్ల, ఆగలి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి తిప్పేస్వామికి 88,527 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి కే ఈరన్నకు 75,391 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 13,136 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
మడకశిర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని జగన్ :
2024 ఎన్నికల విషయానికి వస్తే.. మడకశిరపై పట్టు కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. మరోసారి ఇక్కడ విజయం సాధించాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామికి బదులు ఎర్ర లక్కప్పకు సీటు ఖరారు చేశారు. టీడీపీ కూడా ఈరన్నకు బదులు సునీల్ కుమార్కు చంద్రబాబు టికెట్ కేటాయించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పుంజుకోవాలని చూస్తోంది. మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఇటీవలి కాలంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఒకప్పటి కంచుకోటలో పాగా వేయాలని కాంగ్రెస్ కూడా విశ్వప్రయత్నాలు చేస్తోంది.