ఏపిలో లాక్ డౌన్ సడలింపు... జగన్ కు ప్రధాని మోదీ ఫోన్

By Arun Kumar PFirst Published Apr 20, 2020, 10:14 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాాళ్టి నుండి లాక్ డౌన్ సడలించనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రధాని  మోదీకి వివరించారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ్టి(సోమవారం) లాక్ డౌన్ సడలింపులు అమలు కానున్నాయి. అయితే ఈ సడలింపులు కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుసరించి వుండనున్నాయి. ఈ లాక్ డౌన్ సడలింపు, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ తదితర అంశాలపై మాట్లాడేందుకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం జగన్ కు ఫోన్ చేశారు. 

రాష్ట్రంలో తాజా పరిస్థితి గురించి వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు  తెలుస్తోంది. కోవిడ్19 నివారణ కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహాలపై ప్రధానికి సీఎం వివరించారు. రాష్ట్రంలో వైరస్‌ నివారణకు, వ్యాప్తిని అడ్డుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు. టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకున్న అంశాన్ని సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రంగాలకు ఏప్రిల్ 20 నుంచి మినహాయింపులు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆంక్షల సడలింపులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
 
లాక్‌డౌన్‌ మినహాయింపులో భాగంగా కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలపై ఆంక్షలను సడలిస్తూ పాటించాల్సిన నిబంధనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం.. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిబంధనలను అనుసరించి మినహాయింపులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పరిశ్రమల శాఖ అధికారులు, రవాణా, కార్మిక శాఖ అధికారులకు ప్రభుత్వం పంపింది. 

మినహాయింపులు వర్తించేది వీటికే:

* ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు, రైస్, పప్పు మిల్లులు, పిండి మరలు, డైరీ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు
* ఆర్వో ప్లాంట్లు, ఆహారోత్పత్తి పరిశ్రమలు, ఔషధ తయారీ సంస్థలు, సబ్బుల తయారీ కంపెనీలు, మాస్కులు, బాడీ సూట్లు తయారీ సంస్థలు. శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల తయారీ సంస్థలు, ఐస్‌ ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్‌ కంపెనీలు.
* ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ కార్యకలాపాలు కొనసాగింపు

అయితే రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఈ ఉత్తర్వులు వర్తించవు.


 

click me!