కరోనా విలయతాండవం: దేశంలోనే కర్నూలు ఫస్ట్

By telugu news teamFirst Published Apr 20, 2020, 7:33 AM IST
Highlights

దేశంలో కేవలం ఏప్రిల్ నెలలో ఎక్కువ కేసులు ఎక్కడ నమోదయ్యాయి అనే విషయంపై తాజాగా ఓ సంస్థ సర్వే చేయగా..  షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.


కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశంలోనూ ఈ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశంలో గత నెల మార్చి నుంచి లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ... కేసులు పెరిగిపోతుండటం గమనార్హం. కాగా.. దేశంలో కేవలం ఏప్రిల్ నెలలో ఎక్కువ కేసులు ఎక్కడ నమోదయ్యాయి అనే విషయంపై తాజాగా ఓ సంస్థ సర్వే చేయగా..  షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

మొత్తం 17 ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్లు తేల్చారు. వాటిలో దేశంలోనే 39.9 శాతం నమోదుతో కర్నూలు మొదటి స్థానంలో నిలిచింది. 33.1శాతంతో ఢిల్లీ రెండో స్థానంలో నిలవగా, 13.8 శాతంతో గుంటూరు 16వ స్థానం దక్కించుకుంది. 

రాజకీయ జోక్యంతో వైద్య సేవలు గాడి తప్పిన క్రమంలో కర్నూలు జిల్లాలో తొలిసారి థర్డ్‌ కాంటాక్ట్‌ పాజిటివ్‌ కేసులు కూడా నమోదయ్యాయి. ఆదివారం విడుదలైన హెల్త్‌ బులెటిన్లో ప్రకటించిన కేసుల్లో ఈ థర్డ్‌ కాంటాక్ట్‌ కేసులు వెలుగులోకొచ్చాయి. ఆదివారం 26 పాజిటివ్‌ కేసులు తేలినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో జిల్లాలో పాజిటివ్‌ల సంఖ్య 158కి చేరింది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలౌతుండగా.. ఏపీలో మాత్రం నేటి నుంచి కొన్ని సడలింపులు చేశారు.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆంక్షల సడలింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. 

లాక్‌డౌన్‌ మినహాయింపులో భాగంగా కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలపై ఆంక్షలను సడలిస్తూ పాటించాల్సిన నిబంధనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

దీని ప్రకారం.. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిబంధనలను అనుసరించి మినహాయింపులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పరిశ్రమల శాఖ అధికారులు, రవాణా, కార్మిక శాఖ అధికారులకు ప్రభుత్వం పంపింది. 

మినహాయింపులు వర్తించేది వీటికే:

* ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు, రైస్, పప్పు మిల్లులు, పిండి మరలు, డైరీ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు
* ఆర్వో ప్లాంట్లు, ఆహారోత్పత్తి పరిశ్రమలు, ఔషధ తయారీ సంస్థలు, సబ్బుల తయారీ కంపెనీలు, మాస్కులు, బాడీ సూట్లు తయారీ సంస్థలు. శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల తయారీ సంస్థలు, ఐస్‌ ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్‌ కంపెనీలు.
* ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ కార్యకలాపాలు కొనసాగింపు

అయితే రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఈ ఉత్తర్వులు వర్తించవు.

click me!