కురుపాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 27, 2024, 10:00 PM IST
Highlights

నాగూరు నియోజకవర్గాన్ని 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పేరు మార్చి కురుపాంగా మార్చారు. శత్రుచర్ల విజయరామరాజు కుటుంబానిదే ఇక్కడ ఆధిపత్యం. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా , ఆయన సోదరుడు శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు, అనంతరం ఆయన కోడలు పాముల పుష్పశ్రీవాణిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కురుపాంలో మూడు సార్లు ఎన్నికలు జరగ్గా.. 2009లో కాంగ్రెస్, 2014, 2019లలో వైసీపీలు విజయం సాధించాయి. కురుపాంలో హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణికి మరోసారి టికెట్ కేటాయించారు. తొయ్యపు జగదేశ్వరిని టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించారు చంద్రబాబు. 

కురుపాం.. అంటే వెంటనే గుర్తొచ్చేది రాజులు , రాచరికం. గతంలో విజయనగరం జిల్లాలో వున్న ఈ నియోజకవర్గం .. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోకి వచ్చింది. గతంలో వున్న నాగూరు నియోజకవర్గాన్ని 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పేరు మార్చి కురుపాంగా మార్చారు. ఈ క్రమంలో కొమరాడ, గరుగుబిల్లి మండలాలు కురుపాంలో కలిశాయి.

ఈ నియోజకవర్గం పరిధిలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస ఇతర మండలాలు . శత్రుచర్ల విజయరామరాజు కుటుంబానిదే ఇక్కడ ఆధిపత్యం. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత నాగూరులో నాలుగు సార్లు, పార్వతీపురం, పాతపట్నంలలో ఒక్కోసారి చొప్పున విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన సోదరుడు శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు, అనంతరం ఆయన కోడలు పాముల పుష్పశ్రీవాణిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

కురుపాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. శత్రుచర్ల ఫ్యామిలీదే హవా :

కురుపాం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,94,154 మంది. వీరిలో పురుషులు 94,789 మంది.. మహిళలు 99,354 మంది. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. వరి, జీడిమామిడి, పత్తి, జొన్న ప్రధాన పంటలు. జంఝావతి, వట్టిగెడ్డ, గుమ్మడిగెడ్డ సాగుకు నీరు అందిస్తున్నాయి. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కురుపాంలో మూడు సార్లు ఎన్నికలు జరగ్గా.. 2009లో కాంగ్రెస్, 2014, 2019లలో వైసీపీలు విజయం సాధించాయి.

2009లో కాంగ్రెస్ అభ్యర్ధి జనార్థన్ థాట్రాజ్ గెలుపొందగా.. ఆ తర్వాత వైసీపీ నుంచి పాముల పుష్పశ్రీవాణి 2014, 2019లలో వరుస విజయాలు సాధించి.. వైఎస్ జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పుష్ప శ్రీవాణికి 74,527 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి జనార్థన్ థాట్రాజ్‌కు 47,925 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 26,602 ఓట్ల తేడాతో వరుసగా రెండోసారి కురుపాం కోటపై జెండా ఎగురవేసింది.

కురుపాం శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌పై పుష్పశ్రీవాణి కన్ను :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. కురుపాంలో హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణికి మరోసారి టికెట్ కేటాయించారు. శత్రుచర్ల ఫ్యామిలీ బ్రాండ్ నేమ్, జగన్ సంక్షేమ పాలన తనను గెలిపిస్తాయని శ్రీవాణి ధీమాగా వున్నారు. టీడీపీ విషయానికి వస్తే.. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఆ పార్టీ ఇక్కడ గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా కురుపాంలో విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు పట్టుదలతో వున్నారు. తొయ్యపు జగదేశ్వరిని టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించారు. 

click me!