అసెంబ్లీ సమావేశాల తర్వాత విశాఖకు కేటీఆర్: గంటా శ్రీనివాసరావు

By narsimha lodeFirst Published Mar 25, 2021, 5:43 PM IST
Highlights

అసెంబ్లీ సమావేశాల తర్వాత విశాఖకు వస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు.

శ్రీకాకుళం: అసెంబ్లీ సమావేశాల తర్వాత విశాఖకు వస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు.

గురువారం నాడు గంటా శ్రీనివాసరావు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను శ్రీకాకుళంలో కలిశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు చేస్తున్న ఆందోళనకు తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. 

ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన కేటీఆర్ ను కలిసి ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు.

విశాఖకు రావాలని మంత్రి కేటీఆర్ ను గంటా శ్రీనివాసరావు ఆహ్వానించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత విశాఖకు వస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ను కోరినట్లు ఆయన చెప్పారు. మంత్రులు రాజీనామా చివరి అస్త్రం అంటున్నారని, అయితే స్టీల్‌ప్లాంట్ కోసం మంత్రుల రాజీనామాకు సమయం ఆసన్నమైందన్నారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు తన సీనియారిటీని ప్రక్కన పెట్టి జగన్‌తో నడుస్తానన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఉక్కు పరిరక్షణ కోసం నాన్ పోలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తన రాజీనామాతో ఖాళీ అయిన చోట మళ్లీ పోటీ చేయనని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితున్ని తన స్థానంలో నిలబెడతానని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. 
 

click me!