ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు: జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఏంటని ముందుగా ఆలోచించే నాడు రాజ్యాంగ పెద్దలు శాసన, కార్యనిర్వాహక వ్యవస్తలతో పాటు న్యాయ వ్యవస్థని కూడా ఏర్పాటు చేసి వుంటారని మాజీ మంత్రి, ఏపి టిడిపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. విధ్వంసానికి మారు పేరు గా జగన్ పాలన నడుస్తోందని... కేవలం ఏడాది కాలంలోనే వ్యస్తస్థలన్నిటిని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.
''జగన్ తీసుకుంటున్న అనాలోచిత, అవగాహనా రాహిత్య, అహంకారపూరిత నిర్ణయాలకు న్యాయ వ్యవస్థ లేకపోతే ఈ పాటికి రాష్ట్రం నాశనమయ్యేది. తీసుకునే నిర్ణయం ప్రజా సంక్షేమం కోసం అయితే న్యాయ వ్యవస్థ తో పాటు ప్రజలు కూడా అభినందిస్తారు. జగన్ ఏడాది పాలన లో తీసుకున్న ఏ ఒక్క నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్దిచపోగా చివాట్లు పెట్టింది.చిన్న పిల్లలు చిప్స్ తినడానికి అలవాటు పడినట్లు కోర్టు చేత చివాట్లు తినడానికి జగన్ అలవాటు పడ్డారు'' అని విమర్శించారు.
'' ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయటంపై ఇప్పటికే కోర్టు పలుమార్లు మొట్టికాయలు వేసింది. నీతి, నిజాయితీగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై కులం, అవినీతి ముద్ర వేసి సస్పెండ్ చేసారు. ఇప్పుడు కోర్టు సస్పెన్షన్ ఎత్తివేయాలని... సస్పెన్షన్ కాలం నాటి జీతం కూడా చెల్లించి అతన్ని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించటం జగన్ ప్రభుత్వానికి చెంప పెట్టు'' అని అన్నారు.
read more
''మాస్కులు ఇవ్వలేదన్న పాపానికి దళితుడైన డా.సుధాకర్ ని పిచ్చివాడిగా ముద్ర వేసి పశువు కన్నా హీనంగా నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు. సుధాకర్ విషయం లో జగన్ ప్రభుత్వం చేసిన తప్పుకు ఇప్పటికే ఒక కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు సీబీఐ విచారణలో ఇంకెంత మంది అధికారులు బలవుతారో. అధికారులు చట్టం ప్రకారం నడవాలి, లేకపోతే జగన్ లా ప్రతి వారం కోర్టులకు నడవాల్సి ఉంటుంది'' అని హెచ్చరించారు.
''వైసీపీ నేతలు చెప్పినట్లు చేసి అధికారులు తమ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. నవరత్నాలను నమ్మి ఓటేసిన ప్రజలను జగన్ నట్టేట ముంచారు. జగన్ నవరత్నాలను ప్రజలకు అమలు చేయకుండా వైసీపీ నేతలకే అమలు చేస్తున్నారు. జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు...1.ఇసుక దోపిడీ 2. ప్రాజెక్టుల్లో కమిషన్లు 3. బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములు కట్టబెట్టడం 4.మద్యం ముడుపులు 5.నాటుసారా తయారీకి లైసెన్స్ 6.ఇళ్ళ స్థలాల పేరుతో భూ కుంభకోణం 7. పేపర్ లీకేజితో ఉద్యోగాలు కట్టబెట్టడం 8. నిబంధనల కు విరుద్ధంగా తమ కంపెనీలకు అనుమతులు. 9 అనర్హులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టడం'' అని ఎద్దేవా చేశారు కళా వెంకట్రావు.