కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ కీలక అధికారికి కరోనా పాజిటివ్

By telugu teamFirst Published May 2, 2020, 1:41 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ కు చెందిన కీలక అధికారికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయనతో కాంటాక్టులో ఉన్నవారంతా క్వారంటైన్ కు వెళ్లారు. వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు కరోనా వైరస్ వ్యాధితో వణుకుతోంది. తాజాగా, కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ కీలక అధికారి ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా మున్సిపల్ కార్పోరేషన్ అధికారుల్లో, ఉద్యోగుల్లో అలజడి ప్రారంభమైంది. అధికారులతో కలిసి ఆ ఉన్నతాధికారి కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి కీలకమైన సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. 

కరోనా కట్టడికి ఆయన రెడ్ జోన్లలో కూడా పర్యటిస్తూ వచ్చారు. దీంతో అతనితో కాంటాక్టులో ఉన్న అధికారులు అప్రమత్తమయ్యారు. వారు క్వారంటైన్ కు వెళ్లారు వారందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొంత మంది అధికారులు వర్క్ ఫ్రమ్ హోం తీసుకున్నారు.  ఆ అధికారికి కరోనా రావడంతో కరోనా వైరస్ పరిశీలనా కేంద్రాన్ని మరో ప్రాంతానికి తరలించారు. 

మున్సిపల్ కార్పోరేషన్ పక్కనే ప్రభుత్వాస్పత్రి ఉంటుంది. ఈ ఆస్పత్రిలోని వైద్యులకు కొందరికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. కర్నూలు జిల్లాలో 8 మంది వైద్యులకు కరోనా వైరస్ సోకింది. కర్నూలు జిల్లాలో 436 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారికి కళ్లెం పడడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 62 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,525కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల 33 మంది మరణించారు.   

గత 24 గంటల్లో 5943 పరీక్షలు నిర్వహించగా కొత్తగా 62 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఇప్పటి వరకు 441 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1051 ఉంది. శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

కర్నూలు జిల్లా కరోనా వైరస్ తో అట్టుడుకుతూనే ఉంది. కర్నూలు జిల్లాలో గత 24 గంటల్లో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కృష్ణా జిల్లాలో 12 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. గుంటూరు జిల్లాకు కొంత ఊరట లభించింది. గత 24 గంటల్లో 2 కరోనా కేసులు మాత్రమే బయటపడ్డాయి. 

గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 4, తూర్పు గోదావరి జిల్లాలో 3, కడప జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 6, ప్రకాశం జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో 4 కేసులు బయటపడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 1 కేసు నమోదైంది. విజయనగరం జిల్లా ఇప్పటికీ కరోనా ఫ్రీగానే ఉంది. కర్నూలు జిల్లా 436 కేసులతో ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, గుంటూరు జిల్లా 308 కేసులతో రెండో స్థానంలో ఉంది. 

జిల్లాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

అనంతపురం 71
చిత్తూరు 80
తూర్పు గోదావరి 45
గుంటూరు 308
కడప 83
కృష్ణా 258
కర్నూలు 436
నెల్లూరు 90
ప్రకాశం 61
శ్రీకాకుళం 5
విశాఖపట్నం 29
పశ్చిమ గోదావరి 59

click me!