పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మరో అసెంబ్లీ నియోజకవర్గం కావలి. ఇక్కడ ప్రస్తుతం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కావలిలో వైసిపిదే విజయం... దీంతో ఈసారి ఇక్కడ గెలిచేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
కావలి రాజకీయాలు :
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ రెండుసార్లూ కావలిలో వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్ సిపి పార్టీ గెలించింది. ఇలా గత పరిస్థితులు చూస్తే కావలిలో టిడిపి కంటే వైసిపి బలంగా వుందని అర్థమవుతోంది. దీంతో ఈసారి ఎలాగైనా కావలిపై పట్టుసాధించి విజయబావుట ఎగరేయాలని టిడిపి ప్రయత్నిస్తోంది... వైసిపి కూడా సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని అనుకుంటోంది. దీంతో కావలి అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది.
గత రెండుసార్లుగా (2014, 2019) కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. అంటే గత పదేళ్లుగా కావలి వైసిపి చేతుల్లో వుందన్నమాట. అంతకుముందు 2009 లో టిడిపి తరపున కావలిలో పోటీచేసి గెలిచిన బీద మస్తాన్ రావు కూడా ప్రస్తుతం వైసిపిలో వున్నారు.
కావలిలో టిడిపిని బలోపేతం చేసి గెలిపించే బాధ్యతను కావ్య కృష్ణారెడ్డికి అప్పగించారు అధినేత చంద్రబాబు నాయుడు. ఇటీవలే కృష్ణారెడ్డిని కావలి అసెంబ్లీ ఇంచార్జీగా ప్రకటించి తాజాగా అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారుచేసారు అధినేత చంద్రబాబు నాయుడు.
కావలి నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. బోగోలు
2. అల్లూరు
3. దగదర్తి
4. కావలి
కావలి అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,55,469
పురుషులు - 1,24,911
మహిళలు - 1,30,511
కావలి అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
కావలి సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వైసిపి కొనసాగిస్తోంది. ఇప్పటికే రెండుసార్లుగా కావలిలో గెలుస్తూవస్తున్న ఆయననే ముచ్చటగా మూడోసారి పోటీ చేయిస్తోంది.
టిడిపి అభ్యర్థి :
తెలుగుదేశం పార్టీ కావలి బరిలో కొత్త అభ్యర్థిని నిలిపింది. సాధారణ కాలేజీ లెక్ఛరర్ స్థాయినుండి మైనింగ్ వ్యాపారిగా ఎదిగిన కావ్య కృష్ణారెడ్డికి కావలి టిడిపి టికెట్ దక్కింది.
కావలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
కావలి అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,97,135 (77 శాతం)
వైసిపి - రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి - 95,828 ఓట్లు (49 శాతం) - 14,117 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి- కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి - 81,711 ఓట్లు (41 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - పసుపులేటి సుధాకర్ - 10,647 ఓట్లు (5 శాతం)
కావలి అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,82,939 (79 శాతం)
వైసిపి - రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి - 89,589 (48 శాతం) - 4,969 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - బీద మస్తాన్ రావు - 84,620 (46 శాతం) ఓటమి