ఏపీ రాజదానేదో చెబుతారా..? ఈ దుస్థితి కేవలం ఏపీ ప్రజలకే..: కళా వెంకట్రావు ఆగ్రహం

By Arun Kumar PFirst Published May 3, 2022, 4:56 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితికి వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని దిగజార్చారని టిడిపి నాయకులు కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేసారు.  

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) అనాలోచిత నిర్ణయాల వల్లే రాజధాని అమరావతి (amaravati) అభివృద్దికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనుకడుగు వేస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు (kala venkat rao) ఆరోపించారు. గతంలో రాజధాని నిర్మాణానికి రుణాలిచ్చేందుకు అన్ని బ్యాంకుల ముందుకు వచ్చాయి... కానీ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని కళా వెంకట్రావు ఆరోపించారు. 

''రాజధాని అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం ఎందుకు సొంత నిధులు వెచ్చించడం లేదు? ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసుకోవడానికి, సొంత పత్రికకు ప్రకటనలు ఇచ్చుకోవడానికి నిధులు ఉంటున్నాయికానీ రాజధాని నిర్మాణానికి మాత్రం ఉండటం లేదా? అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా రాజధాని నిర్మాణంపై ఈ ముఖ్యమంత్రి దృష్టి పెట్టలేదు. విధ్వంసం చేసేందుకు అడ్డమైన ఆరోపణలన్నీ చేశారు. జగన్ చేసిన తప్పుడు ప్రచారం వల్లే బ్యాంకులు రుణాలివ్వడానికి అనాసక్తి చూపిస్తున్నాయి'' అని అన్నారు. 

Latest Videos

''రైతులు ఉచితంగా ఇచ్చిన భూముల వల్ల రూ.2లక్షల కోట్ల ఆస్తి ప్రభుత్వానికి లభించింది. అభివృద్ది చేయకుండా, మాస్టర్ అమలు చేయకుండా రూ.2లక్షల కోట్ల ఆస్తిని ప్రశ్నార్థకం చేశారు. చంద్రబాబు నాయుడు రూపొందించి మాస్టర్ ప్లాన్ అమలు చేసి ఉండుంటే రాజధానితో పాటు, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు కూడా అమరావతి నుండి సమకూరేవి. అన్ని ప్రాంతాలకు సమదూరంగా జిల్లాల పునర్విభజన చేశామని చెప్తున్న ప్రభుత్వం మరి రాజధాని విషయంలో సమదూరం సిద్ధాంతం గుర్తుకు రాలేదా.?'' అని వెంకట్రావు నిలదీసారు. 

''కేవలం కొద్దిపాటి నిధులను వెచ్చిస్తే 78 పూర్తి చేసిన ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ, 69 శాతం పూర్తి అయిన ఐఎఎస్, 72 శాతం పూర్తైన గెజిటెడ్ అధికారుల నివాసాలు పూర్తయ్యేవి. రాజధానిపై ఈ ప్రభుత్వానికి దురుద్దేశం లేకుంటే ఆపేసిన నిర్మాణాలు ఎందుకు ప్రారంభించడం లేదు.? రాజధానిలో ప్లాట్లను అభివృద్ధి చేసి రైతులకు అప్పగించాల్సిన బాధ్యతను జగన్ ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదు. రాజధాని ప్రాంతంలోనే ఇల్లు కట్టుకున్నానని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి అదే రాజధాని ప్రాంతంలో టీడీపీ హయాంలో నిర్మించిన 5,028 ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వట్లేదు.?'' అని ప్రశ్నించారు. 

''ప్రభుత్వం ఇళ్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని స్వయంగా ముఖ్యమంత్రే సిగ్గులేకుండా సభల్లో అబద్ధాలు చెప్తున్నారు. న్యాయస్థానం తీర్పు తర్వాత రాజధాని అభివృద్ధికి ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలి. భూములిచ్చిన రైతులకు కౌలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. భూమి లేని పేదలకు ఇవ్వాల్సిన పెన్షన్ నిలిపేశారు. న్యాయస్థానం తీర్పును సైతం ధిక్కరిస్తున్నారు. నెల రోజుల్లో రైతులకు కేటాయించిన ప్లాట్లు అభివృద్ధి చేయాలని కోర్టు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు'' అని ఆరోపించారు. 

''అసెంబ్లీ వేదికగా న్యాయస్థానంపై దురుద్దేశాలను ఆపాదించారు. మూడు రాజధానుల బిల్లు పెట్టాలంటే పార్లమెంట్ లో మళ్లీ బిల్లు పెట్టాలని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయినా మళ్లీ అసెంబ్లీలో మూడు రాజధానులు బిల్లు పెడతామని మాట్లాడటాన్ని ఏమనుకోవాలి.? రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు'' అని కళా వెంకట్రావు ఆందోళన వ్యక్తం చేసారు. 

click me!