
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ ఈ నెల 5న తిరుపతిలో పర్యటించనున్న నేపథ్యంలో.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ, డీఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మేయర్ శిరీషలతో కలిసి మంత్రి రోజా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బాదుడే బాదుడు అంటూ.. వ్యాట్, విద్యుత్ ఛార్జీలను ఆనాడు చంద్రబాబు పెంచలేదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు ఆర్టీసీని ప్రైవేట్పరం చేయాలని చంద్రబాబు చూశారని.. కానీ సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. డిస్కంలకు చంద్రబాబు హయాంలో 28వేల కోట్లు బకాయిలు పెట్టారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ చార్జీలు పెంచారని అన్నారు. కానీ ఇప్పుడు ధరలు కొద్దిగా పెంచిన దానికి ఆగమాగం చేస్తున్నారంటూ విపక్షాలపై మండిపడ్డారు. సీఎం జగన్ కరోనా కష్ట కాలంలో సంక్షేమ పథకాలను అందించారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఫీజ్ రీయింబర్స్మెంట్ చెల్లించకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా, వైద్యం ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారని మంత్రి తెలిపారు. రూ.1800 కోట్లు ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టి చంద్రబాబు వెళ్ళిపోయారని విమర్శించారు. వాటిని సీఎం జగన్ చెల్లించమే కాకుండా.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేస్తున్నారని చెప్పారు.
గతంలో నారకాసుర ఆంధ్రప్రదేశ్గా అనిపించింది కాబట్టే ప్రజలు చంద్రబాబు దించి సీఎం జగన్కు అధికారం కట్టబెట్టారని రోజా చెప్పారు. మహిళలపై దాడులు నేషనల్ క్రైమ్ రికార్డ్స్లో మూడు శాతం తగ్గిందని వెల్లడించారు. కొంత మంది ఉన్మాదుల వల్ల జరిగే ఘటనలకు కఠిన శిక్ష విధిస్తున్నారని తెలిపారు. మహిళా రక్షణ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. తాను మంత్రి అయ్యాక.. సీఎం జగన్ తన జిల్లాకు తొలిసారి పర్యటనకు రావడం సంతోషంగా ఉందన్నారు.