పవన్ టీంలో జగన్ సొంతజిల్లా అధికారి...డిప్యూటీ సీఎం ప్లాన్ ఏంటో..? ఎవరీ మధుసూదన్..?

By Arun Kumar PFirst Published Jul 5, 2024, 7:25 PM IST
Highlights

పవన్ కల్యాణ్.... ఎప్పుడూ సినిమాల్లో గట్టిగా వినిపించే ఈ పేరు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మరింత గట్టిగా వినిపిస్తోంది.  డిప్యూటీ సీఎంగా ఆయన నిర్ణయాలు అలా వుంటున్నాయి మరి. తాజాగా మాజీ సీఎం జగన్ సొంత జిల్లాకు చెెందిన ఆఫీసర్ కు పవన్ కీలక బాధ్యతలు అప్పగించారు. 

Pawan Kalyan : తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో పవన్ కల్యాణ్. తన నటనతోనే కాదు వ్యక్తిత్వంతోనూ సినీ ప్రియులకు దగ్గరయ్యారు... ఇప్పుడు ఆయనకు వున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరే తెలుగు హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే సింప్లిసిటీతో యావత్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు దగ్గరవుతున్నారు పవన్. ఆయనను ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎంతలా అభిమానిస్తున్నారో తాజా ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి. గతంలో కేవలం ఒక్కటంటే ఒక్కటే సీటు గెలిచిన పవన్ ఇప్పుడు పోటీచేసిన సీట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఓడిపోలేదు.   

అంతేకాదు టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఏర్పాటులోనూ పవన్ దే కీలకపాత్ర. ఈ మూడు పార్టీలు కలిసి పోటీచేయడం వల్లే గతంలో 175 కు 151 సీట్లు సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా చిత్తుగా ఓడించగలిగారు. జనసేన పోటీచేసిన అన్ని సీట్లలో గెలిపించుకోవడమే కాదు టిడిపి, బిజెపి ఎమ్మెల్యేల గెలుపుకోసమూ కృషిచేసారు. ఇలా కూటమిని విజయం దిశగా నడిపిన పవన్ కింగ్ మేకర్ అయ్యారు. దీంతో పవన్ ను ఏపీ డిప్యూటీ సీఎంతో పాటు చంద్రబాబు కేబినెట్ లో గ్రామీణాభివృద్ది, పంచాయితీరాజ్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిత్వ శాఖలు దక్కాయి. 

అయితే గత పదేళ్లు ప్రజల పక్షాన పోరాడిన పవన్ ఇప్పుడు పాలకపక్షంలో వున్నారు. ఇన్నిరోజులు రాజకీయ నాయకుడిగా దూకుడుగా వ్యవహరించిన ఆయన... ఇప్పుడు మంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సినిమాల్లో, రాజకీయాల్లో తన మార్క్ చూపించిన ఆయన ఇప్పుడు పాలనలోనూ అదే మార్క్ కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నారు. బాధ్యతలు చేపట్టింది మొదలు ప్రజా సమస్యలపై  దృష్టిపెట్టిన ఆయన వాటి పరిష్కారానికి  అధికారులు ఆదేశాలిస్తున్నారు. ఇలా ప్రజా పాలన అందించేందుకు తన టీమ్ ను  రెడీ చేసుకుంటున్నారు పవన్. 

పవన్ ఓఎస్డిగా కడప ఆర్డివో : 

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం ఓఎస్డి (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) గా యువ అధికారి నియమితులయ్యారు. ప్రస్తుతం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప ఆర్డివో గా వ్యవహరిస్తున్న మధుసూదన్ ను పవన్ కల్యాణ్ ఓఎస్డి అంటే పర్సనల్ సెక్రటరీగా నియమించుకున్నారు. ఈయన గతంలో ధర్మవరం... ప్రస్తుతం కడప ఆర్డివోగా పనిచేస్తున్నారు. 

తనకు పర్సనల్ సెక్రటరీగా అవకాశం కల్పించిన పవన్ కల్యాణ్ కు మధుసూదన్ ధన్యవాదాలు తెలిపారు. ఓఎస్డిగా నియమితులైన తర్వాత డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసారు ఈ యువ అధికారి. తనపై డిప్యూటీ సీఎం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని  మధుసూధన్ తెలిపారు. 

వైఎస్ జగన్ సొంత జిల్లా ఆర్డివోనే ఎందుకు..?

కడప... రాయలసీమలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇదీ ఒకటి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కూడా. కాబట్టి ఎప్పటిలాగే గత సార్వత్రిక ఎన్నికల్లోనూ కడప ఎన్నికలకు వైసిపి సీరియస్ గా తీసుకుంది. ఈ సమయంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన మధుసూదన్ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించగలిగారు. 

ఇలా కడప వంటి సున్నితప్రాంతంలో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన మధుసూదన్ డిప్యూటీ సీఎం పవన్ దృష్టిలో పడ్డారు. దీంతో ఏరికోరి మరీ ఓఎస్డిగా నియమించుకున్నారు పవన్. అయితే మాజీ సీఎం వైఎస్ జగన్ సొంతజిల్లా కడపలో పనిచేసిన అధికారిని పవన్ పర్సనల్ సెక్రటరీగా నియమించుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

మరి ఆ తెలుగు ఐఎఎస్ సంగతేంటి..?
 
ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ కేరళ కేడర్ ఐఎఎస్ అధికారి. 2014 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన కృష్ణతేజ 2015 లో శిక్షణ పూర్తిచేసుకుని అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్... ఆ తర్వాత కేరళ పర్యటకాభివృద్ది సంస్థ ఎండీ, పర్యటకశాఖ డైరెక్టర్, ఎస్సి అభివృద్ది శాఖ డైరెక్టర్ గా ఉన్నత పదవులు పొందారు. కేరళలో సమర్ధవంతంగా పనిచేస్తున్న ఆయనను పవన్ కల్యాణ్ ఓఎస్డి నియమించుకోనున్నారని ప్రచారం జరిగింది.  పవన్ కోరిక మేరకు కృష్ణతేజను డిప్యుటేషన్ పై ఆంధ్ర ప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సిద్దమైనట్లు...ఇప్పటికే  కేంద్రానికి లేఖ కూడా రాసినట్లు ప్రచారం జరిగింది. మరి ఇంతలో ఏమయ్యిందో తెలీదుగానీ మధుసూధన్ ను పవన్ ఓఎస్డిగా నియమించుకున్నారు.  

 

click me!