ఏపీ సీఎం వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సొంత చెల్లెలు షర్మిలపై వైసీపీ శ్రేణులు నీచంగా మాట్లాడుతుంటే జగన్ పట్టించుకోవడం లేదని.. అలాంటి వ్యక్తి మహిళలకు ఏం గౌరవం ఇస్తాడని పవన్ కళ్యాణ్ ప్రశించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీ ఆదివారం పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్ధం సిద్ధం అని రాష్ట్రమంతా పోస్టర్లు ఎందుకు వేశారని ప్రశ్నించారు. సొంత చెల్లెలు షర్మిలపై వైసీపీ శ్రేణులు నీచంగా మాట్లాడుతుంటే జగన్ పట్టించుకోవడం లేదని.. అలాంటి వ్యక్తి మహిళలకు ఏం గౌరవం ఇస్తాడని పవన్ కళ్యాణ్ ప్రశించారు.
జగన్ మమ్మల్ని కౌరవులు అని అంటున్నారని, ఆయనేమో అర్జునుడిలా ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది కలియుగమని.. కౌరవులు, పాండవులతో పోల్చుకోవద్దని పవన్ హితవు పలికారు. తనకు పదవుల మీద ఆశలు లేవని.. అడ్డదారులు తొక్కి పదవులు సంపాదించాలని లేదన్నారు. మాటకు మాట సమాధానం కచ్చితంగా ఇస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామన్నారు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. త్వరలో ఎన్నికల రంగంలోకి వస్తున్నాం.. సభలు పెడతామని పవన్ తెలిపారు.
ఏడు సూత్రాలకు జనసేన కట్టుబడి వుందని ఆయన స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పబోనని జగన్ అంటున్నారని... కానీ ఆయన చెప్పేవే అబద్ధాలంటూ పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. సీపీఎస్ రద్దు, పోస్టుల భర్తీ లాంటి హామీలపై ఎండగడతామన్నారు. జగన్ దుర్మార్గ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని.. కులాలకు అతీతంగా నిలబడకపోతే, ఏరికోరి మరోసారి దుర్మార్గ పాలన తెచ్చుకోవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.