ఆనందయ్య మందు : చంద్రబాబుకు ఆ చరిత్ర ఉంది.. జనవిజ్ఞాన వేదిక

By AN TeluguFirst Published May 25, 2021, 4:05 PM IST
Highlights

గుంటూరు : శాస్త్రీయత నిగ్గు తేలని ఆనందయ్య మందును వెంటనే పంపిణీ చేయాలని తెలుగుదేశం పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు కోరటాన్ని జనవిజ్ఞానవేదిక వ్యవస్థాపక కార్యదర్శి జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు. 

గుంటూరు : శాస్త్రీయత నిగ్గు తేలని ఆనందయ్య మందును వెంటనే పంపిణీ చేయాలని తెలుగుదేశం పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు కోరటాన్ని జనవిజ్ఞానవేదిక వ్యవస్థాపక కార్యదర్శి జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు. 

గతంలో కూడా నారా చంద్రబాబునాయుడు అశాస్త్రీయమైన చేపమందుకు విస్తృత ప్రచారం చేసిన చరిత్రవుందన్నారు. జనవిజ్ఞానవేదిక చేసిన న్యాయ పోరాటం ఫలితంగా చేపమందును చేప ప్రసాదంగా మార్చినారని గుర్తు చేశారు. ప్రజల అజ్ఞానాన్ని, నిరక్షరాస్యత, పేదరికం, మూఢవిశ్వాసాలను సొమ్ము చేసుకోవాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాకులాడే దృక్పథాన్ని రాజకీయ నాయకులు విడనాడాలని కోరారు. 

ఆనందయ్య మందు ప్రయోగాలకు నిలబడి, శాస్త్రీయతను నిరూపించుకున్న తర్వాతనే ప్రజలకు పంపిణీ చేయాలన్నారు. ఆయుర్వేద మందుగా ప్రకటించాలన్నా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అనుమతిని పొందాలన్నారు. 

శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించి శాస్త్రీయత నిగ్గు తేలిన తర్వాతనే ప్రజలకు పంపిణీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. 1796లో ఎడ్వర్డ్ జెన్నర్, 1885లో లూయిస్ పాశ్చర్ లాంటి శాస్త్రవేత్తలు పలు రోగాలకు వ్యాక్సిన్ లు కనుగొనటం ద్వారానే నేడు ప్రపంచ మానవాళి మశూచి, కలరా,ప్లేగు,పోలియో లాంటి వ్యాధుల నుంచి రక్షించబడినారని గుర్తు చేశారు. 

నేడు కరోనా నివారణకు తోడ్పడే వ్యాక్సిన్ ల ఉత్పత్తి సంస్థలను సంప్రదించి కేంద్ర ప్రభుత్వం 300 కోట్ల డోసులను సమీకరించి భారత దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ను వీలైనంత త్వరగా అందించడమే తక్షణ పరిష్కారమన్నారు.  వైద్యరంగాన్ని పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టి, ప్రైవేటు ఆసుపత్రుల ఆర్థిక దోపిడీని నివారించాలన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులను, మందుల తయారీని ప్రభుత్వాలే  చేపట్టాలన్నారు. ప్రస్తుతం భారతదేశంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో కేవలం 1.14 శాతం మంది మాత్రమే మరణిస్తున్నారని, 95 శాతం మందికి ఇంటి వద్దనే నయమవుతుందని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చి, ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి ప్రాణాపాయ స్థితిలో వున్న వారిలో ఎంతమందికి ఆనందయ్య మందుతో నయం అయినదో లెక్క తేల్చాలన్నారు.

రాందేవ్ బాబా మొదటగా కరోనాకు మందు రూపొందించానని విష ప్రచారం చేసి, శాస్త్రవిజ్ఞాన విభాగాలన్నీ ఖండించిన తర్వాత ఆ ప్రచారాన్ని విరమించుకున్నారని గుర్తు చేశారు. ఇటీవల రాందేవ్ బాబా మరల మానవాళిని రక్షిస్తున్న అల్లోపతి వైద్యం పై దుష్ప్రచారం చేసి, ప్రతిఘటన రాగానే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారన్నారు.

click me!