
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఐదేళ్లు పనిచేశారు. కీలక ప్రాజెక్టులను పూర్తి చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత నాదేనంటున్నారు. ఏ రాజకీయ నాయకుడు చేయనంత అభివృద్ధి తానే చేశానంటూ మైకులముందు ఊదరగొడుతున్నారు.
అయిదేళ్లపాటు నా శాఖ ఇంత నా శాఖ అంత అంటూ చెప్పుకున్న ఆమంత్రిని ఇప్పుడు డమ్మీ మంత్రి అంటూ వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఏ మంత్రి అయినా అతని వ్యవహార శైలి చూసే ఏడాది లోపే ఆయన డమ్మీయా కాదా అని చెప్పేస్తారు.
కానీ ఏపీలో ఆ మంత్రిని ప్రజలు గుర్తించలేదా...లేక ఆ మంత్రి మేనేజ్ చేశారా...ఇవే ఇప్పుడు హాట్ టాపిక్. ఇంతకీ డమ్మీ మంత్రి అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న ఆ మంత్రి ఎవరనుకుంటున్నారా ఇంకెవరు భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు.
భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు 2014లోనే ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ విస్తరణలో కొందరికి ఉద్వాసన పలికితే మరికొందరి శాఖలు మారాయి. అయితే ఆయన శాఖ మాత్రం పదిలంగానే ఉంది.
భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా దేవినేని ఉమా మహేశ్వరరావు ఉన్నప్పటికీ అన్నీ తానై చంద్రబాబు వ్యవహరించారంటూ అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. అంటే ముఖ్యమంత్రిగా అన్ని శాఖలపై పట్టు ఉండొచ్చు కానీ భారీ నీటి పారుదల శాఖపైనే చంద్రబాబు అత్యంత శ్రద్ధ పెట్టారంటూ ప్రచారం జరిగింది.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మెుదలు పెట్టిన ప్రాజెక్టులపై దేవినేని ఉమా మహేశ్వరరావు కంటే చంద్రబాబుకే అవగాహన ఎక్కువ ఉందని ప్రచారం. ఇకపోతే ఆయా ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఇచ్చిన వేర్వేరు స్టేట్మెంట్లే అందుకు నిదర్శనం.
పట్టిసీమను ఇంజనీర్లే సాధ్యం కాదన్నారు కానీ నేను చెప్తే పూర్తి చేశారంటూ చంద్రబాబు పదేపదే చెప్పుకొచ్చారు. ఇకపోతే ఆంధ్రప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు ఒక స్టేట్మెంట్ ఇస్తే మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వేరే స్టేట్మెంట్ ఇచ్చేవారు. ఒకరి స్టేట్మెంట్ కి మరోకరి స్టేట్మెంట్ కి పొంతన ఉండేది కాదు.
ప్రతీ సోమవారం పోలవరం పేరుతో చంద్రబాబు పోలవరం చుట్టే తిరిగారు. అదే పోలవరం ప్రాజెక్టును ఎన్నికల ప్రధాన అస్త్రంగా కూడా వాడుకున్నారు. మెుత్తానికి తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారాన్ని పూర్తి చేసుకుంది.
అయితే ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కీలక రాజకీయ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు దేవినేని ఉమా మహేశ్వరరావుకు పోలవరం ప్రాజెక్టుపై అవగాహన ఉందా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
పోలవరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేయలేవు, ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడలేవు నువ్వు మంత్రివా అంటూ విరుచుకుపడ్డారు. ఇకపోతే రాజకీయాల్లో కీలక నేత ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం దేవినేని ఉమా మహేశ్వరరావుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు పోలవరం ప్రాజెక్టు విషయంలో సాయం చేద్దామని ప్రయత్నిస్తుంటే అది మంత్రికి అర్థం కాక ఆయన్నే విమర్శిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు నోరు పెద్దది కాబట్టే మంత్రిగా నెగ్గుకు రాగలిగారంటూ మరికొందరు వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మెుత్తానికి దేవినేని ఉమా మహేశ్వరరావుపై వస్తున్న ఈ వ్యాఖ్యలు ఆ పార్టీని కలవరపాటుకు గురి చేస్తున్నాయి.