‘నేను చనిపోతున్నా’.. సోషల్ మీడియాలో పోస్ట్.. సినిమా రేంజ్ లో కాపాడిన పోలీసులు..

By AN TeluguFirst Published Apr 20, 2021, 9:45 AM IST
Highlights

ఇంటి పోరు పడలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సోమవారం తెల్లవారుజామున తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇది చూసి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రైల్వేకోడూరు పోలీసులను ఆశ్రయించారు. సీఐ ఆనందరావు, ఎస్ఐ పెద్ద ఓబన్న తక్షణం స్పందించారు. టెక్నాలజీ ఆధారంగా ఆయన ఆచూకీ  గుర్తించారు. అపస్మారక స్థితికి చేరిన ఆయనను కాపాడారు. 
 

ఇంటి పోరు పడలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సోమవారం తెల్లవారుజామున తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇది చూసి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రైల్వేకోడూరు పోలీసులను ఆశ్రయించారు. సీఐ ఆనందరావు, ఎస్ఐ పెద్ద ఓబన్న తక్షణం స్పందించారు. టెక్నాలజీ ఆధారంగా ఆయన ఆచూకీ  గుర్తించారు. అపస్మారక స్థితికి చేరిన ఆయనను కాపాడారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రైల్వేకోడూరులోని రామ్ నగర్ కు చెందిన బుర్రు లింగేశ్వర యాదవ్ (41) బెంగళూరు లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. ఆయన సోదరుడు వెంకటరమణయ్య కోడూరులో న్యాయవాది.

 లింగేశ్వర యాదవ్ కు 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆమె కూడా అదే కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. 

గొడవలు ఎక్కువ కావడంతో ఇదివరకే ఆమె భర్త, ఆయన కుటుంబ సభ్యుల పై కోడూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసులో వారు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. పెద్దమనుషుల సమక్షంలో చాలాసార్లు పంచాయతీలు చేసిన వీరి కాపురం కుదుట పడలేదు.

ఈ క్రమంలో తిరుపతిలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న భార్య.. ఈనెల 10న రైల్వేకోడూరులోని భర్త ఇంటికి తన అనుచరులతో ప్రవేశించి, విలువైన వస్తువులు, బంగారం తీసుకెళ్లినట్లు బాధితులు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. 

ఈ విషయమై భార్య తరపు వారిని అడిగే అందుకని లింగేశ్వర యాదవ్ ఈ నెల 17న సాయంత్రం తిరుపతికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో గానీ సోమవారం ఉదయం ఆయన ‘నేను చనిపోతున్నా’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినట్లు పోలీసులు వివరించారు. 

లింగేశ్వర యాదవ సోదరుడు, న్యాయవాది వెంకటరమణయ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మొదట కానిస్టేబుళ్లను తిరుపతికి పంపించి ఆయన భార్య, బంధువుల ఇళ్లల్లో వెతికి ఇచ్చారు. ఈ లోపు ఆయన ఫోన్ ట్యాప్ చేశారు. ఫోన్ స్విచాఫ్ రావడంతో సాంకేతిక శాఖకు సమాచారం అందించారు.

వారు లొకేషన్ చూసి చివరగా నెల్లూరు జిల్లా రాపూరు లో ఫోన్ పని చేసినట్లు చెప్పారు. అక్కడ ఆయనకు బంధువులు ఉన్నారు. వారికి ఫోన్ చేసి కనుక్కో గా ఆయన అక్కడికి రాలేదని తెలిపారు. ఇక్కడ లాడ్జీలో ఏమైనా ఉన్నారా అని వెతికించారు. ఓ లాడ్జీలో లింగేశ్వర యాదవ్ ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే అతను నిద్ర మాత్రలు తీసుకుని అపస్మారక స్థితికి చేరినట్లు వెల్లడించారు.

ఆయన్ని అక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి తర్వాత తిరుపతికి తరలించినట్లు ఎస్ఐ వివరించారు. ఆయన ప్రాణాలతో బయట పడటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఊపిరి పీల్చుకున్నారు.

click me!