కరోనా భయంతో ఒంగోలు కలెక్టరేట్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

By telugu teamFirst Published Aug 31, 2020, 10:44 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. రోజు రోజుకూ కరోనా వైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ భయంతో ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి అనూహ్యంగా విజృంభిస్తోంది. రోజు రోజుకూ కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ స్థితిలో ప్రజల్లో కరోనా వైరస్ ఆందోళన పెరుగుతోంది. ఈ క్రమంలో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో వీరాంజనేయులు అనే హెడ్ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో గల కోవిడ్ కంట్రోల్ రూంలో పనిచేస్తున్న వీరాంజనేయులు ఇంటి నుంచి చీరను తెచ్చుకుని దాంతో ఉరేసుకుని మరణించాడు.

ఇదిలావుంటే, దేశంలో కరోనా వైరస్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానానికి చేరుకుంది. నిన్న కూడా 10 వేల పైచిలకు కేసులు నమోదవడంతో... రాష్ట్రంలో కేసుల సంఖ్య 4.24 లక్షలు దాటింది. దీనితో రెండవ స్థానంలో ఉన్న తమిళనాడును వెనక్కి నెట్టి ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానానికి చేరుకుంది. మహారాష్ట్ర ఇప్పుడు మొదటి స్థానంలో కోనసాగుతుండగా ఏపీ రెండవ స్థానంలో ఉంది. 

ఏపీలో కరోనా కేసులు జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నాయి. వరుసగా 5వ రోజు కూడా 10 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 10,603 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,767కి చేరింది. 

నిన్నటి బులెటిన్ ప్రకారంగా... గత 24 గంటల్లో వైరస్ కారణంగా 88 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 3,884కి చేరుకుంది. నిన్న 63,077 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా, ఇప్పటి వరకు టెస్టుల సంఖ్య 36,66,422కి చేరింది. గడిచిన 24 గంటల్లో 9,067 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

వీరితో కలిపి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,21,754కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 99,129 యాక్టివ్ కేసులున్నాయి. కోవిడ్ కారణంగా నెల్లూరు 14, చిత్తూరు 12, కడప 9, అనంతపురం 7, పశ్చిమ గోదావరి 7, తూర్పు గోదావరి 6, శ్రీకాకుళం 6, కృష్ణ 5, కర్నూలు 5, విజయనగరం 5, గుంటూరు 4, ప్రకాశం 4, విశాఖపట్నంలలో నలుగురు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజే అనంతపురం 695, చిత్తూరు 948, తూర్పు గోదావరి 1090, గుంటూరు 593, కడప 952, కృష్ణ 383, కర్నూలు 811, నెల్లూరు 1028, ప్రకాశం 881, శ్రీకాకుళం 819, విశాఖపట్నం 866, విజయనగరం 558, పశ్చిమ గోదావరిలలో 979 కేసులు నమోదయ్యాయి.

click me!