
విజయవాడ నుండి తూర్పుగోదావరి జిల్లాకు తరలిస్తున్న భారీగా హవాలా నగదు, నగలు పట్టుబడ్డాయి. ముగ్గురు వ్యక్తుల నుండి రూ.40 లక్షల నగదు, రూ.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హరిబాబు, బాలాజీ, మణిదీప్ అనే ముగ్గరిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
విజయవాడలో హవాలా డబ్బు పట్టుబడటం ఇది మొదటిసారి కాదు. గతేడాది కూడా ఇలాగే పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుండి హైద్రాబాద్ కు హవాలా సొమ్ము తరలిస్తున్న ముఠాను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నరసాపురం నుండి స్విఫ్ట్ కారులో హైద్రాబాద్ కు తరలిస్తున్న రూ. 1.49 కోట్ల ఇండియన్ కరెన్సీ, రూ. 24 లక్షలు విలువ చేసే యూఎస్ డాలర్లను పోలీసులు సీజ్ చేశారు.
అదే ఏడాది విజయవాడ పోలీసులు మరో హావాలా రాకెట్ ను పట్టుకొన్నారు. నిందితుల నుండి 1.77 కిలోల బంగారం,40 కిలోల వెండిని స్వాధీనం చేసుకొన్నారు. అంతేకాదు నిందితుల నుండి రూ. 88 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు.
ఇలా విజయవాడ హవాలా వ్యవహారానికి కేంద్రంగా మారుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడ హవాలా ముఠా కార్యక్రమాలు చేస్తోందా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.