పెళ్లైన నెలకే..వరుడికి కరోనా పాజిటివ్, షాక్ లో వధువు

By telugu news teamFirst Published May 8, 2020, 12:24 PM IST
Highlights

ఓ నవ వరుడికి కరోనా సోకినట్లు గుర్తించారు. గాజువాకలోని వడ్లపూడి లక్ష్మిపురం కాలనీకి చెందిన 29 ఏళ్ల యువకునికి జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అతడిని గీతం ఆస్పత్రికి తరలించారు.


ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకీ కొత్త కేసులు పుట్టుకువస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుననా కూడా కేసులు పెరుగుతుండటం గమనార్హం. విశాఖలోనూ రోజుకో ప్రాంతంలో కొత్త కేసులు నమోదౌతున్నాయి.

గురువారం తూర్పు, గాజువాక, పెందుర్తి, దక్షిణ నియోజకవర్గాల్లో వేరువేరు ప్రాంతాల్లో మొత్తం 13 మందికి పాజిటివ్‌ రావడంతో ఆయా ప్రాంతాల్లో కలకలం చెలరేగింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54కు చేరింది. పరిస్థితి చేజారకుండా అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ కఠిన నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. ఆంక్షలు అమలు చేస్తూ, పారిశుధ్య పరిరక్షణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.  

తాజాగా ఓ నవ వరుడికి కరోనా సోకినట్లు గుర్తించారు. గాజువాకలోని వడ్లపూడి లక్ష్మిపురం కాలనీకి చెందిన 29 ఏళ్ల యువకునికి జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అతడిని గీతం ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఆరుగురు కుటుంబ సభ్యులను కూడా గీతంలో క్వారంటైన్‌ చేశారు. 

ఈ యువకుడు మార్చి 20న కువైట్‌ నుంచి ముంబై మీదుగా విశాఖకు చేరుకుని పరీక్ష చేయించుకున్నాడు. నెగెటివ్‌ రిపోర్ట్‌ రావడంతో హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నాడు. తరువాత పరీక్షల్లో కూడా నెగిటివ్‌ రావడంతో గతనెల 8న పెళ్లి చేసుకున్నాడు. 

ఇప్పుడు పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో.. స్థానికులు భీతిల్లుతున్నారు. కాగా... వరుడికి పాజిటివ్ రావడంతో వధువు కూడా షాక్ లో ఉంది. పెళ్లికి వచ్చిన బంధువులు కూడా భయపడుతున్నట్లు తెలుస్తోంది. అతని కుటుంబసభ్యులందరినీ క్వారంటైన్ కి తరలించనున్నారు.

click me!