జగన్‌కు అల్టిమేటం.. ఉద్యమానికి సిద్ధం, సీఎస్‌కు నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు

By Siva KodatiFirst Published Dec 1, 2021, 1:48 PM IST
Highlights

సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు (ap govt employees) ఉద్యమ కార్యాచరణకు రెడీ అయ్యారు. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు (sameer sharma) ఉద్యమ కార్యాచణ నోటీసు ఇచ్చారు ఉద్యోగ నేతలు

సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు (ap govt employees) ఉద్యమ కార్యాచరణకు రెడీ అయ్యారు. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు (sameer sharma) ఉద్యమ కార్యాచణ నోటీసు ఇచ్చారు ఉద్యోగ నేతలు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక నేతలైన బొప్పరాజు, బండి శ్రీనివాసులు ఈ మేరకు సీఎస్ సమీర్‌శర్మకు నోటీస్ అందజేశారు.

ఈ నెల 7వ తేదీ నుంచి ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తామని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ న్యాయపరమైన డిమాండ్లను, సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు వివిధ రూపాల్లో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయనున్నారు. ఉద్యోగుల డిమాండ్లలో 11వ పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల లోన్స్, అడ్వాన్సుల చెల్లింపు తదితర అంశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు సహా విశాఖ, తిరుపతి, ఏలూరు, ఒంగోలు నగరాల్లో డివిజన్ స్థాయి సదస్సులు నిర్వహించనున్నాయి ఉద్యోగ సంఘాలు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తమ డిమాండ్లను నెరవేర్చే వరకు.. తాము తగ్గబోమని హెచ్చరించారు ఉద్యోగ సంఘం నేతలు.

Also Read:జగన్‌కు షాక్.. నిరసనకు సిద్ధమైన ప్రభుత్వోద్యోగులు, కార్యాచరణ ఖరారు..!!

ఇక గత ఆదివారం ఏపీ జేఏసీ (ap jac) అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateswarlu) మాట్లాడుతూ... పీఆర్సీ అమలు, సిపియస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ,1600కోట్ల చెల్లింపులపై ప్రత్యేకంగా కార్యవర్గ సమావేశంలో చర్చించామని ఆయన తెలిపారు. ప్రభుత్వం పిఆర్సీ నివేదికను బయట పెట్టకుండా ఉద్యోగులను అవమానిస్తోందని వెంకటేశ్వర్లు ఆరోపించారు. మా జేఏసీ అమరావతి లో ఉన్న సంఘాలన్నీ భేటీ అయ్యామని... ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని పీఆర్సీ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీరిచ్చే జీతాలు మా హక్కు.. అది భిక్ష కాదని, సచివాలయం ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిది (venkatrami reddy) అనుభవరాహిత్యమన్నారు. 

ఆయన ఏమీ మాట్లాడుతూన్నాడో ఆయనకే తెలియదని... ఆయన నాయకుడై రెండేళ్లేనంటూ వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మా సంఘాలకు దశాబ్దాల చరిత్ర ఉందని.. మేము ఉద్యమానికి వెళ్తున్నాని స్పష్టం  చేశారు. వెంకట్రామిరెడ్డి కూడా మాతో కలిసి రమ్మని కోరుతున్నామని...  2019 డీఏ అరియర్స్ ఇంకా రాలేదని వెంకటేశ్వర్లు చెప్పారు. కేంద్రం అన్ని డిఏ లు ఇచ్చిందని... ప్రభుత్వం బకాయి ఉన్న అన్ని డీఏలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం 1600 కోట్లు బకాయిలు మాకు చెల్లించాల్సి వుందని.. ఆర్ధిక మంత్రి ఒక్కసారైనా ఉద్యోగుల తో చర్చించారా అని వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఉద్యోగుల రగిలిపోతున్నారని.. పేదల కోసం పని చేసే ఉద్యోగులను ఆర్ధిక మంత్రి కించపరిచేలా మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 94 ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు సిద్ధం అవుతున్నాయని.. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి వేదికగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా పీఆర్సీ ప్రకటన చేస్తే మేము ఒప్పుకొమన్నారు. 

click me!