బోటు వెలికితీత: సత్యం లంగర్‌కు తగిలిన ఇనుప వస్తువు, బోటుగా అనుమానం

By sivanagaprasad KodatiFirst Published Oct 16, 2019, 2:32 PM IST
Highlights

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద కచ్చులూరు వద్ద బోటు వెలికితీతకు సంబంధించి బుధవారం మరోసారి సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. దీనిలో భాగంగా ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్లకు బలమైన వస్తువు తగిలినట్లుగా తెలుస్తోంది. లంగర్‌కు చిక్కింది బోటేనని సత్యం బృందం భావిస్తోంది

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద కచ్చులూరు వద్ద బోటు వెలికితీతకు సంబంధించి బుధవారం మరోసారి సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. దీనిలో భాగంగా ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్లకు బలమైన వస్తువు తగిలినట్లుగా తెలుస్తోంది.

లంగర్‌కు చిక్కింది బోటేనని సత్యం బృందం భావిస్తోంది. దీనిని బయటకు లాగేందుకు సత్యం బృందం ప్రయత్నిస్తోంది. గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో వెలికీతత పనులకు అవకాశం ఇవ్వాల్సిందిగా ధర్మాడి సత్యం ప్రభుత్వాన్ని కోరాడు.

దీనికి అంగీకరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సామాగ్రిని కచ్చులూరు వద్దకు తరలించుకోవచ్చని తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం మొదటి విడతలో వేసిన లంగర్‌ కంటే పెద్ద లంగర్‌ను వేసింది.

మొదటి విడతలో లంగర్‌కు ఏదో ఇనుప వస్తువు తగిలినట్లు భావించి.. దానిని ప్రొక్లెయిన్ సాయంతో బయటు లాగేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఇనుప రోప్ తెగిపోవడంతో దానిని విరమించుకున్నారు. 

గత నెల 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నంలో  మండలం కచ్చలూరు వద్ద గోదావరి నదిలో పాపికొండలు వెళ్తున్నరాయల్ వశిష్ట బోటు మునిగిపోయింది.

ఈ బోటులో ప్రయాణీస్తున్న 38 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 13 మృతదేహాలు ఇంకా వెలికితీయాల్సి ఉంది. ఈ ప్రమాదం నుండి సుమారు 26 మంది సురక్షితంగా బయటపడ్డారు.

ఈ బోటును వెలికితీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నాలు చేశాయి. చివరికి రాష్ట్ర ప్రభుత్వం  ధర్మాడి సత్యం బృందానికి  రూ. 22 లక్షలకు టెండర్ ను ఇచ్చింది.

గత నెల చివరి వారంలో  మూడు రోజుల పాటు ధర్మాడి సత్యం బృందం బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా  గోదావరి  నదిలో  బోటు వెలికితీసేందుకు ఆటంకం ఏర్పడింది. దీంతో వరద తగ్గే వరకు బోటు వెలికితీసే పనులను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

గోదావరి నదిలో వరద తగ్గుముఖం పట్టింది.దీంతో  ఈ నది నుండి బోటును వెలికితీసేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారు. ఈ  అనుమతి మేరకు బోటు వెలికితీసే ప్రయత్నాలను ప్రారంభించారు.

రాయల్ వశిష్ట బోటులో ప్రయాణం చేసి ఆచూకీ లేకుండా పోయిన వారు మృతి చెందినట్టుగానే డెత్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని కూడ ఏర్పాటు చేసింది.
 

click me!