కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం హమీ ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి డిమాండ్ చేశారు
విజయవాడ: కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం హమీ ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి డిమాండ్ చేశారు. ఐటీ దాడులకు తామేమీ భయపడడం లేదని ఆయన స్పష్టం చేశారు.
శనివారం నాడు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై పలుమార్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అయితే ఏపీలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగానే తాత్సారం చేస్తోందన్నారు. చైనాలో కమ్యూనిష్టు పార్టీ, ప్రభుత్వం వేరు కాదని... అదే తరహాలోనే ఎన్డీఏ సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతోందన్నారు.
కేంద్రం ఇప్పటికైనా వెనుకబడిన కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాకినాడలో రిఫైనరీ ఏర్పాటును కూడ పట్టించుకోవడం లేదన్నారు.
ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చినందుకే రైల్వేజోన్ తో పాటు ప్రత్యేక హోదాను కేంద్రం తొక్కిపెట్టిందన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై కేంద్ర ఉక్కు మంత్రి చేతిలో ఏమీ లేదన్నారు.
ఏపీ పట్ల కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కేంద్రం కోరే సమాచారాన్ని తాము సోమవారం నాటికి అందిస్తామన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఐటీ దాడులకు తాము భయపడడం లేదన్నారు. ఐటీ అధికారులు వచ్చి పోతూనే ఉంటారని ఆయన చెప్పారు. గతంలో ఐటీ అధికారులు వచ్చిన సమయం... ప్రస్తుతం వస్తున్న సమయాన్నిజాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు.