రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. వ్యవసాయ అధికారులతో సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు.
రైతులను వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణపై సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. వరికి బదులు చిరుధాన్యాలను పండించాలని సూచించారు. ఈ విషయంలో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో చిరు ధాన్యాల బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ దిశగా అధికారులు వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. రసాయన వ్యవసాయం నుంచి రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. చిరు ధాన్యాలు పండించే రైతులకు అవసరమైన ప్రోత్సహకాలు అందించాలని చెప్పారు.
సేంద్రీయ రైతులను ప్రొత్సహించాలి.
క్రిమి సంహాకర మందులు వాడకుండా సహజసిద్ధంగా వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. వారికి అదనపు ప్రోత్సాహకాలు అందించాని ఆదేశించారు. సహజసిద్ధంగా చేసే వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. దానికి అవసరమైన పరికరాలు కూడా ప్రభుత్వమే అందించాలని అన్నారు. సేంద్రీయ ఎరువుల తయారిని ప్రొత్సహించాలని తెలిపారు.
నాణ్యమైన విత్తనాలు, ఎరువులే అమ్మాలి..
రైతులకు వ్యాపారులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులనే అమ్మాలని సీఎం జగన్ అన్నారు. కల్తీ ఉత్పత్తులు అమ్మిత్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. రైతులకు మంచి విత్తనాలు, ఇతర వ్యవసాయానికి అవసరమైన ఉత్పత్తులు అందించాలనే ఆలోచనలతో ఆర్బీకేలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ వ్యవస్థను ఎవరు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించినా.. సహించబోమని హెచ్చరించారు. ఇందులో ఉద్యోగుల ప్రమేయం ఉండదని చెప్పారు. ఒక వేళ వారు ఇందులోకి ప్రవేశిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. రైతులకు అన్ని రకాల ఎరువులు, విత్తనాలు, మందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. కొరత ఉందనే సమస్యే ఉండకూదని తెలిపారు. అవసరమైన విత్తనాలను ముందే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా రైతులు సాగు చేస్తున్న పంటలు, విస్తీర్ణం వంటి వివరాలు నమోదు చేయాలని చెప్పారు. ప్రతీది హేతుబద్దంగా జరగాలని తెలిపారు.
సేంద్రీయ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి..
అధికారులు సేంద్రీయ ఉత్పత్తులపై దృష్టి సారించాలని అన్నారు. రైతులు కూడా సేంద్రీయ ఉత్పత్తుల తయారీ, వాడకంపై దృష్టి పెట్టాలని కోరారు. పశువులకు అందించే గ్రాసం, ఇతర పోషకాలు కూడా సేంద్రీయ ఉత్పత్తులే అయితే బాగుంటుందని అన్నారు. ఇలా చేస్తే పశువులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు వాటి నుంచి నాణ్యమైన పాలు వస్తాయని తెలిపారు. ఆర్గానిక్ పాలకు మంచి డిమాండ్ ఉండటం వల్ల రైతుకు కూడా అధిక ఆదాయం వస్తుందని అన్నారు. సేంద్రీయ పాల ప్రాసెసింగ్ సెంటర్లు జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాలని ఆదేశించారు. సేంద్రీయ పాల మార్కెటింగ్పై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం జగనన్న పాల వెల్లువ పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.