కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. అధిష్టానం పిలుపు మేరకు గత మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కిరణ్.. శుక్రవారం సోనియాతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
కాంగ్రెస్ (congress) అధినేత్రి సోనియా గాంధీతో (sonia gandhi) ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి (kiran kumar reddy) భేటీ అయ్యారు. 45 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయాలపై కిరణ్ కుమార్ రెడ్డి సలహాలు, సూచనలు సోనియా గాంధీ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు 3 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి అక్కడే వున్నారు. సోనియాతో భేటీ తర్వాతే తిరుగు పయనం అవ్వాలని భావించిన కిరణ్... ఎట్టకేలకు శుక్రవారం మధ్యాహ్నం అధినేత్రితో భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు.
ALso Read:కాంగ్రెస్ అధిష్టానం నుండి పిలుపు: న్యూఢిల్లీకి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
అయితే.. ఏపీపీసీసీ (ap pcc) అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డిని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లుగా గత కొన్నిరోజుల నుంచి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ బలహీనంగా ఉన్న పార్టీకి ఊపు తీసుకువచ్చే విధంగా ఏం చేయాలని దానిపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. 2014 ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభావం ఏమాత్రం కనిపించకపోవడం, క్యాడర్ చెల్లాచెదురు కావడం, నాయకత్వ లోపం వంటి అన్ని విషయాల పైన అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలను కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించాలని హైకమాండ్ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన సోనియా గాంధీతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.