అచ్చెన్నాయుడి గాయం పచ్చిగా మారింది: హెల్త్ బులిటెన్ విడుదల

By telugu teamFirst Published Jun 13, 2020, 11:53 AM IST
Highlights

ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి హెల్త్ బులిటెన్ విడుదలైంది. సుదీర్ఘ ప్రయాణం వల్ల ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని సూపరింటిండెంట్ సుధాకర్ చెప్పారు.

గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడి హెల్త్ బులిటెన్ విడుదలైంది. సుదీర్ఘ ప్రయాణం కారమంగా గత ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని జిజీహెచ్ సూపరింటిండెంట్ సుధాకర్  చెప్పారు. అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామని ఆయన అన్నారు. ఆ గాయానికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 

గాయం తగ్గడానికి రెండు మూడు రోజులు వట్టవచ్చునని, బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులను కొనసాగిస్తున్నామని డాక్టర్ సుధాకర్ చెప్పారు. షుగర్ సాధారణ స్థితిలోనే ఉందని అన్నారు. 

ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత, మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడిని గుంటూరు ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. విజయవాడ సబ్ జైలు నుంచి ఆయనను గుంటూరు ప్రత్యేక ఆస్పత్రికి తరలించారు. జైలు అధికారుల అనుమతితో ఆయనను ఆస్పత్రికి తరలించారు. 

కోర్టు ఆదేశాలతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే అచ్చెన్నాయుడికి ఆపరేషన్ జరిగింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఆయనను ఏసీబీ అధికారులు ప్రత్యేక కోర్టు ముందు శుక్రవారంనాడు ప్రవేశపెట్టారు. ఆయనకు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజులు రిమాండ్ విధించారు. అనారోగ్యం కారణంగా ఆయనను ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశించారు. 

దాంతో ఆయనను తొలుత విజయవాడ సబ్ జైలుకు తరలించి, ఆ తర్వాత గుంటూరు ఆస్పత్రికి తరలించారు. ప్రధాన నిందితుడైన ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ను కూడా అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఆయనకు కూడా రెండు వారాల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు.  

click me!